రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు... పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడుతూ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా.... ప్రభుత్వం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టింది. 2019 సెప్టెంబర్ ఆరో తేదీన మొదటిసారి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెలరోజుల పాటు తొలి విడత కార్యక్రమం జరిగింది. 2020 జనవరి రెండో తేదీ నుంచి పది రోజులపాటు రెండో దఫా కార్యక్రమాన్ని చేపట్టారు. పల్లెలు, పట్టణాలను పూర్తి పరిశుభ్రంగా ఉంచేలా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పచ్చదనం పెంపు దిశగా తగిన చర్యలు తీసుకున్నారు. కొత్తగా తీసుకొచ్చిన పంచాయతీరాజ్, పురపాలక చట్టాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పల్లెప్రగతిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో నర్సరీలు, ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణాన్ని చేపట్టారు.
జనాభా ప్రాతిపదికన నిధులు
ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేకంగా ఓ ట్రాక్టర్ను సమకూర్చారు. బడ్జెట్లో నిధులు కేటాయించి ప్రతి నెలా జనాభా ప్రాతిపదికన నిధులు ఇస్తున్నారు. వీటన్నింటి కారణంగా పల్లెల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ అవార్డులు కూడా దక్కాయని తెలిపింది. ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల ప్రభావం లేదని చెబుతోంది. ఈ తరుణంలో మూడో విడత పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పది రోజుల పాటు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని కూడా ఇందులో భాగంగానే చేపడతామని తెలిపారు.
చేరుకోవాల్సిన లక్ష్యాలు ఇంకా ఉన్నాయి