తూర్పుగోదావరి జిల్లా పాపికొండలు వద్ద లాంచీ ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం దురదృష్టకరమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద బాధితులకు అండగా ఉంటామని... అవసరమైన సహాయక చర్యలు అందిస్తామని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
ఏపీ మంత్రికి రాష్ట్ర మంత్రుల ఫోన్
లాంచీ ప్రమాద ఘటనపై ఐటీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరంగల్ జిల్లా బాధితులను ఫోన్ ద్వారా సంప్రదించారు. ప్రమాదంలో బయట పడిన వారి క్షేమ సమాచారాలు ఆరా తీశారు. ఏపీ మంత్రి కురసాల కన్నబాబుతో మాట్లాడి తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. మరో వైపు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూడా ఏపీ మంత్రి కురసాల కన్నబాబును ఫోన్ ద్వారా సంప్రదించి తమ రాష్ట్ర వాసులకు తగిన సహాయం అందేలా చూడాలని కోరారు.
ఇదీ చూడండి : ప్రమాదానికి గురైన బోటులో 31 మంది రాష్ట్రవాసులు