తెలంగాణ

telangana

ధరణిపై హైకోర్టు కీలక ఆదేశాలు... నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు

By

Published : Nov 3, 2020, 5:10 PM IST

ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదుపై హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఒత్తిడి చేయొద్దని... వ్యవసాయ ఆస్తుల యజమానులను ఆధార్, కులం వివరాల కోసం ఒత్తిడి చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇప్పటి వరకు సేకరించిన వివరాలను ఎవరికీ ఇవ్వకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చట్టబద్ధత, డేటా భద్రతపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది.

privacy issues on Dharani portal
ధరణిపై హైకోర్టు కీలక ఆదేశాలు... నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు

ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, వ్యవసాయ ఆస్తుల నమోదుకు వివరాల సేకరణపై హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ధరణిలో ఆస్తుల నమోదు కోసం.. యజమానుల వ్యక్తిగత వివరాలను సేకరించడాన్ని సవాల్ చేస్తూ... దాఖలైన మూడు వేర్వేరు ప్రజా ప్రయోజనాలపై ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్టాలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఆధార్, కులం వివరాలు సేకరిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. భూ యజమానుల కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు అడుగుతున్నారని పేర్కొన్నారు. ధరణిలో వివరాలు లేకపోతే.. ఎలాంటి భూలావాదేవీలు జరగవని సీఎం చెబుతున్నారని వివరించారు. సేకరించిన వివరాలన్నీ వెబ్ సైట్ ద్వారా ప్రజా బాహుళ్యంలో అందుబాటులోకి వస్తాయని.. దానివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని హైకోర్టుకు వివరించారు.

ఎలా భద్రత కల్పిస్తారు?

నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ధరణి పోర్టల్ ఏర్పాటు చేశారని.. అయితే ఆ చట్టంలో వ్యవసాయేతర భూముల ప్రస్తావన లేదని హైకోర్టు పేర్కొంది. ఆధార్, కులం వివరాల సేకరణపై రెవెన్యూ చట్టంలో ఎక్కడా వివరించలేదని తెలిపింది. సేకరించిన వివరాలకు ఎలా భద్రత కల్పిస్తారు? ఆ వివరాలు ఎవరి ఆధీనంలో ఉంటాయి? ఎవరెవరు వాటిని పరిశీలించవచ్చన్న అంశాలను చట్టంలో ప్రస్తావించలేదని తెలిపింది.

తీవ్ర విఘాతం కలుగుతుంది..

వివరాల సేకరణ, భద్రతకు సంబంధించి ఐటీ చట్టంలోని అంశాలను... నూతన రెవెన్యూ చట్టంలో పొందుపరచలేదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఏ చట్టం ప్రకారం ఆధార్, కులం, వ్యవసాయేతర వివరాలు సేకరిస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నంచింది. ధరణిలో వ్యక్తిగత వివరాల నమోదు చట్టబద్ధం కాదన్న పిటిషనర్ల వాదనలో ప్రాథమికంగా బలం కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఎవరైనా డేటా దుర్వినియోగానికి పాల్పడితే ప్రజల వ్యక్తిగత గోప్యతకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

రెండు వారాల గడువు

డేటా భద్రతకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వివరించారు. భద్రతకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. రైతుబంధు పథకం అమలు చేస్తున్నందున వ్యవసాయ భూముల యజమానుల ఆధార్ వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలుకు రెండు వారాలు గడువు ఇవ్వాలని ఏజీ కోరారు. అయితే అప్పటి వరకు వ్యవసాయేతర వివరాల కోసం ఒత్తిడి చేయవద్దని.. వ్యవసాయ భూముల యజమానుల ఆధార్, కులం వివరాలు కోసమూ ఒత్తిడి చేయవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

వివరాల సేకరణకు చట్టబద్ధత, డేటా భద్రతపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని సర్కారును ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:'ధరణిలో సమస్యలుంటే వెంటనే సంప్రదించాలి'

ABOUT THE AUTHOR

...view details