మేఘన ఎంఐటీ ఘజియాబాద్ నుంచి ఫైనాన్స్లో ఎంబీఏ చేసింది. ఈమెది రాజస్థాన్లోని చిన్న పల్లెటూరు. మల్టీనేషనల్ ఫైనాన్స్ సంస్థలో ట్రేడర్ కావాలన్నది ఆమె కల. సింగపూర్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఉద్యోగమూ చేసింది. యూఎస్ 9/11 ఉగ్రదాడి ప్రభావం ఈమె ఉద్యోగంపైనా పడింది. ఉద్యోగ వేటలో ఉండగా రిషి దాస్ పరిచయమయ్యాడు. ఉద్యోగాలను కల్పించే సంస్థ ఉంటే బాగుంటుందన్న ఆలోచనను పంచుకుంది. తనకీ అది నచ్చి ‘హైర్ప్రో’ పేరిట సంస్థను 2003లో బెంగళూరులో ప్రారంభించారు. 25 ఏళ్ల వయసులో మేఘన దీనికి కోఫౌండర్, సీఓఓ. నాలుగేళ్లలోనే టీఐ, గోల్డ్మాన్ శాక్స్, సిట్రిక్స్, జునిపర్ మొదలైన ఎన్నో అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేశారు. తన ఆలోచనలు, అభిరుచులు కలిసిన రిషినే పెళ్లి చేసుకుంది. ప్రెగ్నెన్సీ కారణంగా కొంత విరామం తీసుకుంది.
‘ఇండీక్యూబ్’తో ప్రారంభమై..
ఈసారి మునుపటికి భిన్నంగా అల్ట్రా మినరల్స్ పేరిట మాన్యుఫాక్చరింగ్ సంస్థను 2009లో ఏర్పాటు చేసింది. నాలుగేళ్లలోనే దేశవ్యాప్తంగా దీని ప్లాంట్లను విస్తరించింది. వ్యాపారం పెరిగే కొద్దీ ఆఫీసుకు ఎక్కువ స్థలం అవసరమైంది. ఏటా మారడమూ ఇబ్బందయ్యేది. ఒక్కసారే 50,000 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. కానీ అంతా అవసరంలేదు. అందుకే స్టార్టప్లకు కొంత సబ్ లీజ్కి ఇచ్చింది. సొంత వ్యాపారాల పరిధి పెరిగే కొద్దీ వేరే సంస్థలను ఖాళీ చేయించేది. ఇలా మేఘనకు కమర్షియల్ రియల్ ఎస్టేట్పై అవగాహన ఏర్పడింది. దాన్నే వ్యాపారంగా మలచాలనుకుంది. ఫలితమే ‘ఇండీక్యూబ్’. 2015లో ప్రారంభమైన ఈ సంస్థ.. స్టార్టప్ల నుంచి పరిశ్రమల వరకు వర్క్ స్పేస్తోపాటు మెయింటెనెన్స్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ సహా ఇతర సేవలనూ అందిస్తుంది. మొదట తమ సేవింగ్స్తోనే సంస్థను ప్రారంభించారు. మూడేళ్ల తర్వాత ఈ వ్యాపారం నచ్చిన ఆశిష్ గుప్తా అనే వ్యక్తి రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టాడు. ఆరేళ్లలో బెంగళూరు, హైదరాబాద్ సహా ఆరు నగరాలకు సేవలను విస్తరించారు. 30,50,000 చదరపు అడుగుల స్థలంతో 50కి పైగా ప్రాపర్టీలు సొంతం చేసుకోగలిగారు. ప్రస్తుతం ఈ సంస్థ వార్షికాదాయం రూ.400 కోట్లకు పైమాటే. ఎకనామిక్స్ టైమ్స్ విడుదల చేసిన ‘త్వరగా ఎదుగుతున్న సంస్థ’ల జాబితాలో ఇండీక్యూబ్ది 20వ స్థానం. ఆసియా-పసిఫిక్ రీజియన్లో 500 ‘హైగ్రోత్’ సంస్థల జాబితాలో 112వ ర్యాంకు. మింత్రా, ఫిలిప్స్, ఎలీ లిలీ, బైజూస్, వాల్మార్ట్, రెడ్బస్ వంటి ఎన్నో సంస్థలు ఈమె వినియోగదారులే.