తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదుకుంటున్న ఐటీ ఉద్యోగుల హెల్ప్‌లైన్‌ సేవలు

ఎనిమిది నెలల గర్భిణికి, నాలుగు రోజులుగా కడుపులో బిడ్డ కదలడం లేదు, రెగ్యులర్‌గా చూసే డాక్టర్‌ స్పందించడం లేదు. దగ్గర్లో ఎక్కడా స్కానింగ్‌ సెంటర్లు లేవు. ఏం చేయమంటారు? కీళ్ల నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేదు. ఏ మందులు వేసుకోమంటారు? ఇలా అనేక సమస్యలకు పరిష్కారం చూపారు. 4 రోజుల్లో వెయ్యికి పైగా ఫోన్​కాల్స్​.. ఎంటనుకుంటున్నారా.. ఆదుకుంటున్న హెల్ప్​లైన్​ సేవలు.. అది కూడా 4 రోజుల్లోనే.. లాక్​డౌన్​ నేపథ్యంలో ఫోరం ఫర్‌ పీపుల్స్‌ హెల్త్‌ పేరుతో ఐటీ ఉద్యోగులు నిర్వహిస్తున్న మెడికల్‌ హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫోన్​కాల్స్‌ అవి. ఆ సేవల్లో వైద్యులు, ఐటీ నిపుణులు పాలుపంచుకుంటున్నారు.

By

Published : Apr 5, 2020, 8:16 AM IST

services-of-it-employees-looking-for-help-in-telangana
ఆదుకుంటున్న ఐటీ ఉద్యోగుల హెల్ప్‌లైన్‌ సేవలు

‘ఫోరం ఫర్‌ పీపుల్స్‌ హెల్త్‌’ పేరుతో ఐటీ ఉద్యోగులు నిర్వహిస్తున్న మెడికల్‌ హెల్ప్‌లైన్‌కు ఇలా అనేక ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. నాలుగు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యిమందికి పైగా ఫోన్‌ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అనేక చోట్ల ఆసుపత్రులు, వైద్యులు అందుబాటులో లేకపోవడం. అత్యవసరం అయితే తప్ప చూడకపోవడం.. స్కానింగ్‌ సెంటర్లు మూతపడటం. రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఐటీ ఉద్యోగులు, తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో ఉంటున్న కొందరు వైద్యులు, సామాజిక కార్యకర్తలు కొందరు కలిసి ‘ఫోరం ఫర్‌ పీపుల్స్‌ హెల్త్‌’ పేరుతో మెడికల్‌ హెల్ప్‌లైన్‌ సేవలను ప్రారంభించారు.

50 మంది ఐటీ ఉద్యోగులు

040-48214595 నంబరుకు ఫోన్‌ చేయడం ద్వారా వైద్య సలహాలు పొందొచ్చని ప్రకటించారు. 50 మంది ఐటీ ఉద్యోగులు వాలంటీర్లుగా తమ సమయాన్ని ఇందుకోసం వెచ్చిస్తున్నారు. రద్దీ పెరగడం వల్ల వీరి సంఖ్యను వందకు పెంచాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. 70 మంది వైద్యులు తమ సేవలను అందివ్వడానికి ముందుకు వచ్చారు. ఇందులో ఫిజీషియన్లు, గైనకాలజిస్టులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, ఆర్థోపెడీషియన్స్‌, చర్మ వ్యాధి నిపుణులు.. ఇలా అన్ని రకాల వైద్యులు ఉన్నారు. ఫోన్‌ చేసిన వెంటనే వాలంటీర్‌గా పనిచేస్తున్న ఐటీ నిపుణుడు ప్రాథమిక సమాచారం నమోదు చేసుకొని సంబంధిత వైద్యునికి కనెక్ట్‌ చేస్తారు. వైద్యుడు ఫోన్‌లోనే మాట్లాడి అవసరమైన సలహాలు ఇవ్వడం, మందులు చెప్పడం లేదా వాట్సప్‌లో పంపడం చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు, వైద్యులు ఎక్కడివారక్కడే ఉండి ఈ సేవలందిస్తున్నారు. రోజుకు కనీసం 300 మంది వినియోగించుకొంటున్నారని నిర్వాహకుల్లో ఒకరైన కిరణ్‌చంద్ర తెలిపారు. చిన్న పట్టణాల నుంచి ఎక్కువగా కాల్స్‌ వస్తున్నాయన్నారు.

వైద్యులతో మాట్లాడి..

అత్యవసర సందర్భాల్లో తెలిసిన ఆసుపత్రుల వైద్యులతో మాట్లాడి అక్కడికి వెళ్లేలా ప్రయత్నిస్తున్నామన్నమని గైనకాలజిస్టు డాక్టర్‌ వెన్నెల తెలిపారు. యాంటీబయాటిక్‌, సాధారణ మందులు అవసరమైతే చెప్తున్నామని, దంత సమస్యలు, కాళ్ల నొప్పులు లాంటివి ఉన్నప్పుడు కొద్ది రోజులు వేచి చూడాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు. మూడు రోజుల్లో 40కి పైగా ఆర్థోపెడిక్‌ సమస్యల కాల్స్‌ వచ్చాయని బెంగళూరు నుంచి పాల్గొంటున్న ఆర్థోపెడీషియన్‌ మల్లు అరుణ్‌ వివరించారు. కీళ్ల నొప్పులు, భుజాల నొప్పులతోపాటు దీర్ఘకాలంగా సమస్యలు ఉన్న వారు కూడా ఎక్కువగా ఫోన్‌ చేస్తున్నారని అన్నారు.

ఇదీ చూడండి :గాంధీ నుంచి 15 మంది కరోనా బాధితులు డిశ్ఛార్జి

ABOUT THE AUTHOR

...view details