తెలంగాణ

telangana

ETV Bharat / state

Crop Loans: తగ్గిన పంట రుణాలు... వరి వద్దని చెప్పడమే కారణమంటున్న బ్యాంకర్లు

Crop loans: యాసంగి సీజన్‌లో పంటరుణాల పంపిణీ నెమ్మదిగా సాగుతోంది. యాసంగిలో వరి వద్దని ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచించగా... ఏ పంట వేయాలనేదానిపై రైతులు తేల్చుకోలేకపోతున్నారు. అందుకే రుణాల కోసం రైతులు బ్యాంకులకు రావడం లేదని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు.

By

Published : Dec 13, 2021, 5:04 AM IST

Crop Loans
Crop Loans

Reduced Crop Loans: ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటరుణాల పంపిణీ నెమ్మదిగా సాగుతోంది. ఈ ఏడాది పంపిణీ లక్ష్యం 53 వేల కోట్లు కాగా... ఇంకా 17 వేల కోట్ల దాకా రుణాలు ఇవ్వాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. వరి వద్దని ప్రభుత్వం చెప్పడంతో ఏ పంట వేయాలనేదానిపై ఇంతకాలం రైతులు అనిశ్చితిలో ఉండటంతో రుణాలకు రావడం లేదని బ్యాంకులు చెబుతున్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మంది పంటరుణాలు తీసుకోగా ఈ ఏడాది ఇప్పటికి వారిలో ఇంకా 15 లక్షల మంది పాత బాకీ కట్టి కొత్త రుణం తీసుకోలేదని అంచనా.అందుకే రుణాల కోసం బ్యాంకులకు రావడం లేదని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు... రుణమాఫీ అవుతుందని భావించి కొందరు రైతులు పాత బాకీ కట్టడానికి, రెన్యూవల్‌కు ముందుకు రావడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు.

గడువులోగా కట్టకపోతే అధిక వడ్డీ భారం...

Reduced Crop Loans: పంట రుణం తీసుకున్న రైతు నిర్ణీత గడువులోగా కట్టకపోతే అధిక వడ్డీ భారం పడుతోంది. రుణాలపై కేంద్రం బ్యాంకులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని సైతం బ్యాంకులు రైతులపైనే వేస్తున్నాయి. గడువులోగా కట్టే రైతులతో పోలిస్తే కట్టనివారిపై 2 రెట్లు అదనంగా వడ్డీ వేస్తుండటం గమనార్హం. దీంతో లక్షలాది మంది రైతులు కట్టే వడ్డీ వందల కోట్లలో ఉంటోంది. గడువులోగా చెల్లిస్తే ఈ సొమ్మంతా రైతులకు మిగిలే అవకాశాలున్నా చాలా మంది వినియోగించుకోవడం లేదు. తెలంగాణలో పంట రుణాలు తీసుకున్న వారిలో సగానికిపైగా రైతులపై అదనపు వడ్డీ భారం పడుతోందని వ్యవసాయ శాఖ అంచనా.

అదనపు వడ్డీ ఎలా వేస్తున్నారంటే..

రుణం తీసుకునే రైతు ఏడాదిలోగా చెల్లిస్తే వడ్డీ తక్కువగా ఉంటుంది. రుణం తీసుకున్న ఏడాదిలో కడితే 4 శాతం అంటే లక్షకు 4 వేలు మాత్రమే వడ్డీ కట్టాలి. వాస్తవానికి పంట రుణాలపై వడ్డీ 9 శాతం అయినప్పటికీ... ఏడాదిలోగా చెల్లించినందుకు... కేంద్రం 3 శాతం వడ్డీని రైతుకు రాయితీగా ఇస్తామంది. మరో 2 శాతం రుణం ఇచ్చిన బ్యాంకుకు ప్రోత్సాహకంగా ఇస్తామని కేంద్రం తెలిపింది. అంటే ఏడాదిలోపు చెల్లిస్తే... 4 శాతం వడ్డీనే వసూలు చేయాలి. ఒకవేళ గడువులోగా చెల్లించకపోతే నేరుగా 9 శాతంతో పాటు అదనంగా జరిమానా కింద మరో 2 నుంచి 3 శాతం దాకా బ్యాంకులు వేస్తున్నాయి. అంటే ఏడాదిలోపు చెల్లించే రైతు లక్షకు 4 వేలు వడ్డీ కడితే... గడువు దాటిన తర్వాత చెల్లించే వారు లక్షకు 12 వేలు కట్టాల్సి వస్తోందని బ్యాంకర్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి:Charminar MLA Attack: నమస్తే పెట్టలేదని స్థానికున్ని కొట్టిన ఎమ్మెల్యే.. సీసీటీవీ దృశ్యాల్లో మాత్రం..!

ABOUT THE AUTHOR

...view details