కరోనా ప్రభావంతో దేవాలయ అర్చకులు, పురోహితుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలో 3680 గ్రామీణ ప్రాంత పురాతన దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద ప్రభుత్వం నెలకు రూ.6 వేలు అందిస్తోంది. దేవాదాయ శాఖ పరిధిలోకి రాని ప్రైవేటు దేవాలయాలపై ఆధారపడిన అర్చకులు, శుభకార్యాలు జరిపించే పురోహిత కుటుంబాలు, వాటిపై ఆధారపడిన ఇతర కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
సుముహూర్తాలకు లాక్డౌన్.. అనంతరం మూఢాలు
ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో శుభకార్యాలకు ముహూర్తాలున్నా, లాక్డౌన్తో ఆటంకమేర్పడింది. జులై నెల అనంతరం భాద్రపదం శూన్యం, ఆశ్వయుజ మాసం అధిక మాసం కావడంతో ముహూర్తాలు ఉండవు. కార్తికమాసం (నవంబరు)లో ముహూర్తాలు ఉన్నా, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు గురుమౌఢ్యమి కారణంగా శుభకార్యాలు నిర్వహించరు. దీంతో ఈ సంవత్సరమంతా పురోహితులకు పనులు ఉండవు.
"అర్చకులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం అందిస్తూ వస్తున్నారు. ఈ కఠిన సమయంలోనూ ధూపదీప పథకం కింద ఉన్న ఆలయాల్లో పనిచేసే వారికి గౌరవ వేతనం అందిస్తున్నారు. కానీ శుభకార్యాలు చేసే పురోహితుల పరిస్థితి దారుణంగా ఉంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహకారం అందించడానికి కృషి చేస్తున్నాం." - దౌలతాబాదు వాసుదేవశర్మ, రాష్ట్ర ధూపదీప ఆలయ అర్చక సమాఖ్య అధ్యక్షుడు