తెలంగాణ

telangana

కారు మా బంధువులకు చెందినది.. బాధితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే షకీల్‌

By

Published : Mar 18, 2022, 4:27 PM IST

Updated : Mar 18, 2022, 4:51 PM IST

కారు మా బంధువులకు చెందినది.. బాధితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే షకీల్‌
కారు మా బంధువులకు చెందినది.. బాధితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే షకీల్‌

16:24 March 18

కారు మా బంధువులకు చెందినది.. బాధితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే షకీల్‌

కారు మా బంధువులకు చెందినది.. బాధితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే షకీల్‌

MLA Shakeel on Accident: జూబ్లీహిల్స్​లో కారు ప్రమాదంపై బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ స్పందించారు. కారు తన బంధువుదని ఆయన తెలిపారు. కారును తాను కూడా అడపదడపా నడుపుతుంటానని... ప్రమాదం జరిగినప్పుడు తమ బంధువు కుటుంబసభ్యులు కారులో ప్రయాణించారన్నారు. ప్రమాదంలో చిన్నారి దుర్మరణం చెందడం బాధాకరమని ఆయన చెప్పారు. ఈ విషయంలో బాధితులకు న్యాయం చేయాలని తాను తన బంధువుకు చెప్పానని వివరించారు. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి ఎవరి తప్పు ఉందో తేల్చి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని షకీల్‌ స్పష్టం చేశారు.

ఆ కారు నేను కూడా వాడుతుంటా..

నిన్న జూబ్లీహిల్స్‌లో కారు ప్రమాదం జరిగింది. కారు మా బంధువులకు చెందినది. ఆ కారును అప్పుడప్పుడు నేను కూడా వాడుతుంటా. మహిళనే భయంతో పాపను కింద పడేసింది. కిందపడేసినప్పుడు చిన్నారి మృతిచెందింది. మహిళ కుటుంబాన్ని ఆదుకోవాలని మా బంధువుకు చెప్పాను. మా బంధువులు మహిళ కుటుంబం, పోలీసులతో మాట్లాడారు. మహిళ కుటుంబానికి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. -షకీల్‌, బోధన్‌ ఎమ్మెల్యే

అసలేం జరిగిందంటే..

Car Accident at Jubilee hills: ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న ఓ కారు హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో రెండున్నర నెలల పసికందు మృతిచెందగా,, ఏడాది వయసున్న బాలుడితో పాటు ముగ్గురు మహిళలు గాయపడ్డారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో మాదాపూర్‌ నుంచి టీఆర్‌ నంబరుతో ఉన్న వాహనం దుర్గం చెరువు తీగల వంతెన మీదుగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబరు 45లోని బ్రిడ్జిని దాటి, రోడ్‌ నెంబరు 1/45 కూడలి వైపు వేగంగా వస్తోందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ క్రమంలో బ్రిడ్జి దిగగానే ఒక్కసారిగా అదుపు తప్పినట్లు పేర్కొన్నారు. అక్కడే పిల్లలను ఎత్తుకొని బుడగలు విక్రయిస్తున్న మహారాష్ట్రకు చెందిన కాజల్‌చౌహాన్‌, సారిక చౌహాన్‌, సుష్మ భోంస్లేలను కారు ఢీకొట్టిందని వెల్లడించారు. దీంతో కాజల్‌ చౌహాన్‌ చేతిలో ఉన్న రెండున్నర నెలల పసికందు రణవీర్‌ చౌహాన్‌, సారిక చౌహాన్‌ చేతుల్లో ఉన్న ఏడాది వయసున్న అశ్వతోష్‌ సైతం కిందపడ్డారని వివరించారు.

ప్రమాదంలో చిన్నారి రణవీర్‌ చౌహాన్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మహిళలకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్​ వాహనాన్ని వదిలేసి రోడ్‌ నెంబరు 1 వైపు పరారయ్యాడు. క్షతగాత్రులను స్థానికులు, ట్రాఫిక్‌ పోలీసులు 108లో జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి తరలించారు. చిన్నారి రణవీర్‌చౌహాన్‌ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

​కారుపై బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ మహమ్మద్‌ పేరుతో స్టిక్కర్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే కారును ఎవరు నడిపించారు? ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్మాణ సంస్థ పేరిట కారు రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. పరారైన డ్రైవర్​ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్​లో కారు ప్రమాదంపై బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ స్పందించారు.

ఇదీ చదవండి:

Last Updated : Mar 18, 2022, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details