రాష్ట్రంలో అమలవుతున్న గొర్రెల పంపిణీ పథకానికి కేంద్రం రూ.1000 కోట్లు సబ్సిడీ ఇచ్చిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర పశు, సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) ఎద్దేవా చేశారు. గొర్రెల పథకంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP state president Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. మన రాష్ట్రంలో 2017లో ప్రవేశ పెట్టిన గొర్రెల పంపిణీ పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఒక ఎంపీగా, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అసత్యాలు ప్రచారం చేయడం తగదని మంత్రి హితవు పలికారు. వరిధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ అబద్ధాలు మాట్లాడుతున్నారని తలసాని విమర్శించారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్లోని పశు సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ పథకం ప్రారంభమైనప్పుడు 1000 కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్రం నెరవేర్చలేదని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద మొదటి విడతలో ప్రభుత్వం పూచీకత్తుపై ఎన్సీడీసీ (NCDC)ద్వారా రూ.3549.98 కోట్లు రుణం తీసుకున్నామని తెలిపారు. ఆ అప్పు సంబంధించి ఇప్పటిదాకా అసలు, వడ్డీ కలిపి 9 వాయిదాల్లో రూ.2900.74 కోట్ల రూపాయలు ఎన్సీడీసీకి(NCDC) చెల్లించామని మంత్రి స్పష్టం చేశారు.
రెండో విడత అమలు కోసం లబ్ధిదారుల వాటా మినహాయించి రూ.4593.75 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. అనంతరం ఎన్సీడీసీ అధికారుల బృందం క్షేత్రస్థాయి పర్యటనకు విచ్చేసి సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. ఇంత గొప్పగా ఈ పథకం అమలవుతున్న తరుణంలో బండి సంజయ్ ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. అబద్ధాలు మాట్లాడే వ్యక్తిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు నియమించారో కేంద్రం ఆలోచించాలని హితవు పలికారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు అంశం రాజ్యాంగంలో పొందుపరిచి ఉందని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు అంశం సహా ఏ విషయాన్నైనా రాజకీయం చేయడం భాజపా నేతలకు తగదన్నారు. భాజపా నేతల అసత్యపు ప్రచారాలతో ఆ ప్రభావం కేంద్రంపైనే పడుతుందని మంత్రి తలసాని (talasani srinivas yadav)పేర్కొన్నారు