తెలంగాణ

telangana

By

Published : Jan 20, 2022, 7:47 PM IST

ETV Bharat / state

ఈ ఏడేళ్లలో గిరిజనులకు భాజపా చేసిందేమీ లేదు: మంత్రి సత్యవతి

minister satyavathi comments on BJP: కేంద్రం పోడు చట్టం తెచ్చి గిరిజనులు, ఆదివాసీలకు అన్యాయం చేసిందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆక్షేపించారు. భాజపా నేతలు గిరిజనులు, దళితులను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు పోడుదారులకు న్యాయం చేసేలా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి వివరించారు.

minister satyavathi rathode
సత్యవతి రాథోడ్‌

minister satyavathi comments on BJP: గిరిజనులకు ఆర్థిక, రాజకీయ అధికారాలు పెంపొందించేలా సీఎం కేసీఆర్ విధానాలున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించేందుకు శాసనసభ తీర్మానం చేస్తే కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదని ధ్వజమెత్తారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. దళిత, గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనడాన్ని మంత్రి సత్యవతి ఖండించారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంత్రి సత్యవతి, రైతుబంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు రవీంద్రనాయక్‌, హరిప్రియ నాయక్‌తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

త్వరలోనే పరిష్కారం

గిరిజన, దళిత నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్న భాజపా.. ఏడేళ్లలో గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం చేసేందేమి లేదని మంత్రి సత్యవతి విమర్శించారు. పోడు చట్టం కేంద్రం పరిధిలో ఉంటుందని తెలుసుకోకుండా తామే ఉద్యమం చేస్తామని బండి సంజయ్‌ చెప్పడం సిగ్గు చేటని అభిప్రాయపడ్డారు. పోడు భూములపై కేబినెట్ సబ్‌ కమిటీ వేశామని.. త్వరలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. విభజన చట్టంలో ఉన్న గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం ఎందుకు ముందుకు రావడంలేదని మంత్రి ప్రశ్నించారు. గిరిజనులు భాజపాను నమ్మే పరిస్థితిలేదని ఎద్దేవా చేశారు.

ఓటు బ్యాంకుగానే చూశాయి

గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్‌ చర్యలు చేపట్టారు. ఎస్టీల రిజర్వేషన్లను కేంద్రప్రభుత్వమే పెంచటం లేదు. గిరిజనుల వేడుక సమ్మక్క- సారలమ్మ జాతరకు కేంద్రం నిధులు కూడా ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా అన్ని ప్రభుత్వ సంస్థలను మోదీ ప్రైవేటుపరం చేస్తున్నారు. ఎస్టీ రిజర్వేషన్ల జాబితా నుంచి లంబాడీలను తొలగిస్తామని భాజపా ఎంపీ అన్నారు. కాంగ్రెస్‌, భాజపా ప్రభుత్వాలు గిరిజనులను ఓటుబ్యాంకుగా మాత్రమే చూశాయి.

-- సత్యవతి రాథోడ్‌, గిరిజనసంక్షేమశాఖ మంత్రి

గిరిజనులకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు దక్కకుండా భాజపా కుట్ర చేసిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తండాలు, గూడాల్లో భాజపా నేతలను యువతే అడ్డుకుంటుందని పేర్కొన్నారు.

గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్‌ చర్యలు చేపట్టారు: మంత్రి సత్యవతి

ఇదీ చదవండి:Fever Survey in Telangana: 'రాష్ట్రంలో రేపట్నుంచి ఫీవర్‌ సర్వే.. కోటి కిట్లు సిద్ధం'

ABOUT THE AUTHOR

...view details