కూలీల కొరత తీవ్రమవుతుండటం, నీటి వనరులు తగ్గిపోతున్న నేపథ్యంలో రైతులు వరిలో వెద పద్ధతికి మళ్లాలని ఈ సందర్భంగా ప్రసాదరావు వివరించారు. రైతులు వ్యవసాయంపైనే ఆధారపడకుండా.. అనుబంధంగా పశుపోషణ, మేకలు, కోళ్ల పెంపకంపైనా దృష్టి సారించాలని సూచించారు. రెండెకరాల పొలం, రెండు గేదెలతో వ్యవసాయం ఆరంభించిన ఆయనకు ఇప్పుడు ఎనిమిదెకరాల సొంత భూమి ఉంది. 250 పశువుల్ని పెంచుతున్నారు. 50 పైగా బ్లాక్ బెంగాల్ మేకలు, 100 పైగా నాటుకోళ్లు ఉన్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధించారు. వెద పద్ధతిలో సాగు, దిగుబడి తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.
రోజూ 600 లీటర్ల పాలు
అతివృష్టి, అనావృష్టి, కూలీల కొరత, గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితుల్లో పశువులు, మేకల్ని కూడా పెంచుకోవడం లాభదాయకం. ఒక మేక నుంచి ఏడాదికి 30 వేల ఆదాయం సాధించవచ్చు. రెండు గేదెలతో పాడి ప్రారంభించా. పుట్టిన దూడలతో మంద పెంచాను. రోజుకు 600 లీటర్ల పాలను పోస్తుంటాం.
అప్పు దొరకని పరిస్థితుల్లో..
నాలుగెకరాల పొలం ఉన్న నాన్న సుబ్బయ్య.. ఉచితంగా పశువైద్యం అందించేవారు. దీంతోపాటు పిల్లల పెళ్లిళ్లు, ఇతర ఖర్చులకు రెండెకరాలు అమ్మాల్సి వచ్చింది. పదోతరగతి చదువుతున్న నాకు రూ.1000 అప్పు కోసం ప్రయత్నించినా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో నాన్నకు నచ్చజెప్పి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నా. సాగులో ఎన్నో కష్టాలు ఎదురైనా ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు.