తెలంగాణ

telangana

ETV Bharat / state

బీమా పథకం.. ఆసక్తి కరవు

రాష్ట్రంలో పంటల బీమాను చేయించుకోక రైతులు ఆందోళన చెందుతున్నారు. కురుస్తున్న అకాల వర్షాలతో పాటు వడంగండ్లు పడుతున్నాయి. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణాలో మొత్తం సాగు విస్తీర్ణం 53.36 లక్షల ఎకరాలు ఉండగా, ప్రస్తుత యాసంగిలో ప్రీమియం కట్టింది కేవలం 5 లక్షల ఎకరాలకు మాత్రమే. రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది రైతులు నష్టపోతున్నారు.

By

Published : Apr 9, 2020, 8:15 AM IST

insurance-scheme-low-interest-in-telangana-farmers
బీమా పథకం.. ఆసక్తి కరవు

అకాల వర్షాలు రైతులను నష్టపరుస్తున్నాయి. విపత్తుల సమయంలో ఆదుకోవాల్సిన పంటల బీమా పథకం అందరు రైతులకు అందే అవకాశాలు లేకుండా పోయింది. ప్రస్తుత యాసంగిలో కేవలం 2 లక్షల మంది రైతులు 5 లక్షల ఎకరాలకే బీమా ప్రీమియం చెల్లించారు. ఈ సీజన్‌ మొత్తం అన్ని రకాల పంటల సాగు విస్తీర్ణం 53.36 లక్షల ఎకరాలకు చేరిందని వ్యవసాయశాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదించింది. ఇందులో 9.30 శాతం సాగు విస్తీర్ణానికే బీమా చేయిస్తూ రైతులు ప్రీమియం చెల్లించడం గమనార్హం. మొత్తం సాగు విస్తీర్ణంలో తప్పనిసరిగా 50 శాతం విస్తీర్ణానికైనా ప్రీమియం కట్టేలా చూడాలని సీజన్‌ ఆరంభానికి ముందే కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

ఆసక్తి చూపలేదు...

కానీ రాష్ట్రంలో పంటలకు బీమా చేయించడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. బీమా కంపెనీలు సైతం రైతులతో ప్రీమియం కట్టించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ ఇచ్చిన పంట రుణాల నుంచే ప్రీమియం మినహాయించే అవకాశం ఉంది. కానీ వాస్తవానికి గత డిసెంబరు నాటికి పంటరుణాలు పెద్దగా ఇవ్వకపోవడం కూడా బీమా విస్తీర్ణం తగ్గడానికి కారణమైంది. ఏటా మార్చి నుంచి అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులతో వడగండ్లు పడి పంట నష్టం జరగడం రాష్ట్రంలో సాధారణం అని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.

వర్షాలతో ఇబ్బంది

గత 3 రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో సైతం వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39 లక్షల ఎకరాల్లో వరి పైరు కోతకు సిద్ధంగా ఉంది. ఈ పైరు గాలులకు పడిపోయింది. వరితో పాటు మామిడి, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం అధికంగా ఉన్నట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ప్రాథమిక అంచనా ప్రకారం 14 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపింది. ఇందులో వరి 13 వేల ఎకరాలని వివరించింది.

బీమా చేస్తే ఫోన్‌ చేయండి..

బుధవారం వనపర్తి జిల్లాలో ఇలా దెబ్బతిన్న వరిపైరును వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఇలా పంట దెబ్బతింటే దాని రైతులు 72 గంటల్లో ప్రీమియం చెల్లించిన బీమా కంపెనీకి ఫోన్‌ చేసి సమాచారం అందించాలని వ్యవసాయశాఖ సూచించింది. రాష్ట్రంలో రెండు బీమా కంపెనీలు పంటలకు ప్రీమియం వసూలు చేశాయి. జాతీయ వ్యవసాయ బీమా కంపెనీ ఫోన్‌ నంబరు 18005992594, ఇఫ్కో-టోకియో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఫోన్‌ నంబరు 18001035499. ఈ నంబర్లకు రైతులు ఫోన్‌ చేసి పంట నష్టపోయినట్లు చెబితే సంబంధిత కంపెనీ అధికారులు వచ్చి పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తారు. ప్రీమియం చెల్లించిన రైతుల జాబితాలను జిల్లా, మండల వ్యవసాయాధికారులు పరిశీలించి నష్టపోయిన వారి సమాచారాన్ని బీమా కంపెనీలకు పంపేలా చూడాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ఆదేశించారు.

ఇదీ చూడండి :పోలీసుల కోసం.. ఓ కుటుంబం 10 లక్షల విరాళం

ABOUT THE AUTHOR

...view details