తెలంగాణ

telangana

By

Published : Nov 11, 2020, 11:02 AM IST

ETV Bharat / state

అక్కడ 4 కి.మీ ప్రయాణం చేయాలంటే గంట సమయం

హైదరాబాద్ మలక్‌పేట కొత్త మార్కెట్‌ నుంచి ఎంజే మార్కెట్‌ మధ్య దూరం కేవలం 4 కిలోమీటర్లు.. సాధారణంగా ద్విచక్ర వాహనం లేదా కారులో పది నిమిషాల్లోపే చేరుకోవచ్ఛు కానీ ఏకంగా గంట పడితే..? వాహనదారుల అవస్థలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్ఛు

heavy Traffic between Malakpet New Market and MJ Market
అక్కడ 4 కి.మీ ప్రయాణం చేయాలంటే గంట సమయం

హైదరాబాద్ సుల్తాన్‌ బజార్‌ మార్గం వన్‌ వేగా ఉండగా ఇప్పుడు రెండువైపులా వాహనాలను అనుమతిస్తుండటంతో ట్రాఫిక్‌ సమస్య జఠిలంగా మారింది. సోమ, శనివారాలు వచ్చాయంటే ఉదయం 9 గంటలు మొదలుకుని రాత్రి 10 వరకు రద్దీ తగ్గడం లేదు. పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తున్నా నియంత్రించలేక చేతులెత్తేస్తున్న పరిస్థితి. దీనివల్ల వాహనదారులకు సమయం, ఇంధనం వృథా అవుతున్నాయి. ఈ మార్గంలో గంటకు సుమారు 30 వేల వాహనాలు వెళుతున్నాయని అంచనా. ఇప్పుడా సంఖ్య మరింత పెరిగింది.

ఎందుకీ పరిస్థితి..?

ఎంజే మార్కెట్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌ మార్గంలో ఉస్మాన్‌గంజ్‌ (బేగంబజార్‌) నాలా పనులను జీహెచ్‌ఎంసీ యంత్రాంగం చేపట్టింది. జులైలో పనులు ప్రారంభం కాగా.. 45 రోజుల్లో (ఆగస్టు 17 నాటికి) పూర్తి కావాలి. అప్పటి నుంచి ఈ మార్గాన్ని అధికారులు మూసివేశారు. గుత్తేదారు అలక్ష్యం, జీహెచ్‌ఎంసీ పర్యవేక్షణ లోపంతో మూడున్నర నెలలుగా పూర్తి కాలేదు. ఇవి చేసేందుకు మరో 30-45 రోజులు పట్టే అవకాశముంది. దీంతో ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను జాంబాగ్‌, సుల్తాన్‌ బజార్‌, గౌలిగూడ రూట్లలో అనుమతిస్తున్నారు. అసలే ఈ ప్రాంతాల్లో రహదారులు కుంచించుకు పోయాయి. వన్‌ వేగా ఉన్నప్పుడే రద్దీ అధికంగా ఉండేది. ఇప్పుడు రెండు వైపులా అనుమతిస్తుండటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.

బస్సులన్నీ ఇటువైపే..

కోఠి నుంచి వచ్చే వాహనాలకు ఉస్మానియా మెడికల్‌ కళాశాల మెట్రో స్టేషన్‌ వద్ద యూటర్న్‌ ఏర్పాటుచేశారు. అక్కడ మళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఎంజే మార్కెట్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌ మీదుగా ఎంజీబీఎస్‌కు వెళ్లేవి. ఇప్పుడు సుల్తాన్‌బజార్‌, గౌలిగూడ మీదుగా అనుమతిస్తున్నారు. వ్యాపారకేంద్రం బేగంబజార్‌కు నిత్యం వచ్చే వేలాదిమంది కూడా సుల్తాన్‌ బజార్‌ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి. మలక్‌పేట వైపు నుంచి వచ్చే వాహనాలు ఎంజీబీఎస్‌కు చేరేందుకు చాదర్‌ఘాట్‌, గౌలిగూడ మీదుగా వెళుతున్నాయి. ‘‘నాలా పనులు త్వరగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఎప్పటికప్పుడు సూచిస్తున్నాం. కనీసం ఒకవైపు పూర్తి చేసి దారిని విడిచి పెట్టాలని చెప్పాం. అవి కాకపోవడంతోనే సమస్య పరిష్కారం కావడం లేదు. మా పరిధిలోని ట్రాఫిక్‌ పోలీసులతోపాటు అదనపు సిబ్బందిని నియమించి రద్దీని క్రమబద్ధీకరిస్తున్నాం.’’ అని సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:డిసెంబరు నుంచి విద్యాలయాలు తెరుచుకోనున్నాయ్​ !

ABOUT THE AUTHOR

...view details