Governor Tamilisai on Mann Ki Baat: 'మన్ కీ బాత్' వందో ఎపిసోడ్ సందర్భంగా రాజ్భవన్లో ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. పలువురు విద్యార్థులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఆమె విన్నారు. అనంతరం మాట్లాడిన గవర్నర్.. మన్ కీ బాత్ ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిందని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న వారి గురించి సైతం ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమం ద్వారానే.. స్వచ్ఛ భారత్ను ప్రజల్లోకి తీసుకువెళ్లారని గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 70 లక్షల మంది యువత, 2 కోట్ల మందికి పైగా చిన్నారులు డ్రాయింగ్ పోటీల్లో పాల్గొన్నారని గవర్నర్ తెలిపారు. ఈ క్రమంలోనే మన్ కీ బాత్లో చెప్పిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అత్యంత విజయవంతమైందని తెలిపారు. ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మన్ కీ బాత్లో మాట్లాడినప్పుడు తాను కంటతడి పెట్టుకున్నట్లు గవర్నర్ వివరించారు. కిడ్నీ రోగుల బాధలను ప్రధాని అర్థం చేసుకున్నారని ఆమె అన్నారు. మోదీ చెబుతున్న గొప్ప మాటలు.. ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తున్నాయని.. దేశం మంచి మార్గంలో నడుస్తోందని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"మిల్లెట్ ఆహారం గురించి ప్రధాని ప్రస్తావించారు. వందే భారత్ కార్యక్రమం ఆత్మ నిర్భర్ భారత్కు నిదర్శనం. రైల్వే వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. రాజ్భవన్ వేస్ట్ నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేయాలని బోయిన్పల్లి మార్కెట్ వారిని కోరుతున్నాం."- తమిళిసై సౌందర రాజన్, గవర్నర్
అంతకుముందు 'మన్ కీ బాత్'పై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను గవర్నర్ తిలకించారు. అనంతరం మన్ కీ బాత్, యోజన పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ సైనికాధికారులు, పద్మ అవార్డు గ్రహీతలు, వివిధ వర్సిటీల ఉపకులపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.