వర్షకాలం సీజన్లో దోమల వ్యాప్తి నియంత్రణకు ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు జీహెచ్ఎంసీ పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే లిబర్టి రోడ్లో మేయర్ గేట్ పక్కన దోమల మస్కట్ను ఏర్పాటు చేసింది. నిరంతరం రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రయాణించే వ్యక్తులు.. జీహెచ్ఎంసీకి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు దోమల నివారణపై అవగాహన కలిగించేందుకు దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మరిన్ని దోమ మస్కట్లు...
నగరంలోని పలు కూడళ్లలో మరిన్ని దోమ మస్కట్లను ఏర్పాటు చేయాలని బల్దియా యోచిస్తోంది. ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాల కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో నిల్వ నీటిని వారానికి ఒకసారైనా శుభ్రపరిచేలా ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నారు. కాలనీలు, మురికివాడల్లో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఎంటమాలజి ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నారు.
వాటి సంతాన వృద్ధిని బ్రేక్ చేయవచ్చు...
దోమల గుడ్లు, లార్వాలను నశింపచేయడం ద్వారా దోమల సంతాన వృద్ధిని బ్రేక్ చేయవచ్చని ఎంటామాలజీ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. నిల్వ ఉన్న నీటిలో పెరుగుతున్న లార్వాలను తొలగించి, నీటి నిల్వ ట్యాంక్లు, డ్రమ్లు, పరికరాలను శుభ్రపరిచి కొంత సేపు ఎండనివ్వాలని సూచిస్తున్నారు.
యాంటీ లార్వా స్ప్రేయింగ్ పనులు ముమ్మరం