తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కాలంలో.. ఆమె సేవలు అసాధారణం

అంటువ్యాధి అని తెలుసు... ధైర్యంగా సేవలందిస్తున్నారు. వైరస్‌ క్రూరమైనదని తెలుసు.. స్థైర్యంతో ముందుకెళ్తున్నారు. పొరపాటు జరిగితే ప్రాణాలకే ముప్పని తెలుసు కానీ పోరాడుతున్నారు. కుటుంబానికి దూరంగా.. చంటి పిల్లలనూ వదిలేసి కరోనాపై యుద్ధం చేస్తున్నారు. వారే మన నర్సులు..!

By

Published : May 3, 2020, 8:56 AM IST

extraordinary services of nurses in Kovid hospitals
కరోనా కాలంలో.. ఆమె సేవలు అసాధారణం

ఏపీలోని కొవిడ్‌ ఆస్పత్రులన్నింట్లో కలిపి వెయ్యి మందికిపైగా రోగులు ఉన్నారు. వీరి ఆరోగ్య స్థితిని అనుసరించి నర్సులు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. 3 షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడలోని రాష్ట్ర స్థాయి కొవిడ్‌ ఆస్పత్రిలో సుమారు 90 మంది చికిత్స పొందుతున్నారు. ప్రతి షిఫ్టునకు 30 నుంచి 35 మంది నర్సులు సేవలందిస్తున్నారు. ప్రతి రోగి రక్తపోటు, ఇతర ఆరోగ్య లక్షణాలను గంట, 2 గంటలకొకసారి పరీక్షిస్తున్నారు. ప్రత్యేక కవర్ల ద్వారా వచ్చిన భోజనం, అల్పహారాన్ని రోగులకు అందజేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో పడకలకే పరిమితమైన రోగుల విషయంలోనూ శ్రద్ధ చూపుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం 2020ని నర్సుల సంవత్సరంగా ప్రకటించి వారి సేవలను ప్రశంసించింది.

అడుగు తడబడితే..

కొవిడ్‌ రోగులు ఉండే వార్డుల్లోకి వెళ్లేముందు ప్రత్యేక సూట్‌, చేతులకు తొడుగులు, ముఖానికి మాస్కులు ధరించాలి. వీటితో 6 నుంచి 8 గంటల వరకు అలాగే ఉండాలి. ఈ సమయంలో కాఫీ, టీ వంటివి తీసుకునేందుకూ వీల్లేదు. విధులు ముగిశాక సూట్‌ను తొలగించే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ చిన్న పొరపాటు దొర్లినా వైరస్‌ వెంటాడుతుంది.

టెన్షన్‌..టెన్షన్‌...

ఆఫీసులో ఓ రెండు గంటలు ఆలస్యమైతే ఇంట్లో వాళ్ల గురించి మనం ఎంత ఆలోచిస్తాం. మరి ఈ నర్సులు విధులు ముగిసిన వెంటనే ఇళ్లకు పోలేరు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోటళ్లు, వసతిగృహాల్లో ఉంటున్నారు. వారం రోజులు పనిచేసిన తర్వాత వీరి నుంచి నమూనా (తెమడ-స్వాబ్‌) సేకరించి పరీక్షిస్తున్నారు. నెగిటివ్‌ వస్తే రెండు వారాల తర్వాత విధులకు హాజరవుతున్నారు. కుటుంబసభ్యులు వీరు ఉన్న చోటుకు వచ్చి దూరం నుంచే పరామర్శించి వెళ్లిపోతున్నారు.

నర్సులు ఏమన్నారంటే...

* స్వైన్‌ఫ్లూ వంటి కేసులను చూశాం. వందల డయేరియా కేసులు ఒకేసారి వచ్చినా బెదరలేదు. ఈ వైరస్‌ వ్యాప్తి భయపెడుతోంది. గంటలకొద్దీ సూట్‌ను ఒంటిపై ధరించి ఉండడం ఇబ్బందిగానే ఉంది. కానీ విధినిర్వహణలో రాజీపడడం లేదు. ఇలా సేవలందించడం వృత్తిలో భాగమే.

* విధులు ముగిశాక హోటళ్లు, వసతిగృహాల్లోనే కొందరు ఉండిపోతున్నారు. ఎప్పుడైనా ఇళ్లకు వెళితే స్థానికుల నుంచి పలుచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

* చిన్నపిల్లలున్న నర్సుల పరిస్థితి వర్ణనాతీతం. విజయవాడ హోటల్‌లో భార్య (నర్సు) ఉంటే భర్త పాపను దూరంగా చూపించి వెనక్కు తీసుకువెళ్లారు. ఈ దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకోనివారు లేరు.

* ఈ ప్రత్యేక పరిస్థితుల్లో సేవలందిస్తున్న నర్సులకు తగిన ప్రోత్సాహమివ్వాలని భారత ట్రైన్డ్‌ నర్సుల అసోసియేషన్‌ సెక్రటరీ కొత్తపల్లి సుశీల పేర్కొన్నారు.

ఆత్మీయత పంచుతూ...

మానసికంగా కుంగిపోయే వైరస్‌ బాధితులను సాధారణ పరిస్థితికి తీసుకురావడం చాలా కష్టం. ఆ పని సమర్థంగా చేస్తున్నారు నర్సులు. ప్రత్యేక కవరులో భద్రపరిచిన చరవాణి ద్వారా రోగులతో కుటుంబసభ్యులు మాట్లాడేలా చేస్తున్నారు. ‘వారికి ధైర్యం చెబుతూ... వారిలో బాధను తట్టుకొనే శక్తిని నింపుతున్నామ’ని నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఒకరు చెప్పారు.

ఇవీ చూడండి: తెలంగాణలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్​జోన్ జిల్లాలివే..

ABOUT THE AUTHOR

...view details