Wisdom Bridge Book Life Principles: ఒక యువకుడు గురుకులంలో ఉండి అన్ని విద్యలూ నేర్చుకున్నాడు. అతడు తిరిగి ఇంటికి వెళ్లిపోయే సమయం వచ్చింది. గురువు భార్య దగ్గర వీడ్కోలు తీసుకోవడానికి వెళ్లాడు. తమ కళ్లముందు చదువుకుంటూ పెరిగిన ఆ అబ్బాయి మీద ఆమెకి పుత్రవాత్సల్యం. తమను విడిచి వెళ్లిపోతున్నాడని బెంగ. ‘వెళుదూ గానీలే... ముందు భోజనం చెయ్యి, కాసేపు విశ్రాంతి తీసుకో...’ అంటూ ఆ వంకా ఈ వంకా చెప్పి సాయంత్రం వరకూ కళ్లకెదురుగా కూర్చోబెట్టుకుంది. ఇక గురువు వచ్చే వేళ కాగానే ఆ అబ్బాయి చేతికి ఒక లాంతరు ఇచ్చి జాగ్రత్తగా వెళ్లిరమ్మని సాగనంపింది.
కాస్త దూరం వెళ్లాడో లేదో గురువు పిలిచినట్లు వినిపించింది అతనికి. వెనక్కి వెళ్లాడు. శిష్యుడి చేతిలోని లాంతరు తీసుకుని ఆయన ‘ఇక వెళ్లు. జాగ్రత్త’ అన్నాడు. చీకట్లో వెళ్తున్నవాడి చేతిలో దీపం తీసేసుకుని జాగ్రత్తగా వెళ్లమంటాడేంటీ... ఇంతకీ అతడు క్షేమంగా చేరాడా..! నిజానికి ఈ సందిగ్ధావస్థ ప్రతి తల్లీ తండ్రీ పిల్లల పెంపకంలో ఎదుర్కొనేదే. ఇక్కడ గురువు భార్య- పిల్లల పట్ల మన ప్రేమకు ప్రతీక అయితే గురువు క్రమశిక్షణకు సంకేతం. విద్యావంతుడైన ఆ అబ్బాయికి జ్ఞానమే దారి చూపుతుందనీ దీపంతో పనిలేదనీ గురువు ఉద్దేశం. ప్రేమా క్రమశిక్షణా... ఈ రెంటి మధ్యా నలిగిపోని తల్లిదండ్రులు ఉండరు కదా. అందుకే తన పుస్తకాన్ని దాజి ఈ కథతోనే ప్రారంభించారు. పిల్లల పెంపకం గురించి ఆయన ప్రధానంగా తొమ్మిది సిద్ధాంతాలను చర్చించారు.
తన జీవితం నుంచి ఉదాహరణలు ఇస్తూ, సందర్భానుసారం శాస్త్రీయ పరిశోధనలను పేర్కొంటూ రాసిన ఈ పుస్తకం- మంచి తల్లిదండ్రులు ఎలా కావచ్చో చెబుతుంది. పిల్లల పెంపకంలో తాతయ్యలూ బామ్మల విలువేమిటో చాటుతుంది. ఈ ఆంగ్ల పుస్తకంలోని విశేషాల సారాంశం చూద్దామా!
ఊరంటే... ప్రాంతం కాదు :బిడ్డను పెంచాలంటే ఊరంతా పూనుకోవాలని ఆఫ్రికన్ల సామెత. ప్రపంచంలో ఎక్కడైనా అంతేనేమో. ఒకప్పుడు మన సమాజాలన్నీ గ్రామీణ సమాజాలే. అక్కడ అందరూ కలిసిమెలిసి బంధాల్నీ బాధ్యతల్నీ పంచుకునేవారు. పిల్లల్ని పెంచడంలోనూ తలా ఒక చెయ్యీ వేసేవారు. బోలెడంత మంది సభ్యులతో సమష్టి కుటుంబాలుండేవి. వారందరి ప్రేమా ఆప్యాయతల నడుమ పిల్లలు భద్రంగా, స్వేచ్ఛగా పెరిగేవారు. నగర జీవితమూ, చిన్న కుటుంబాలూ, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడమూ తప్పనిసరైన ఈ రోజుల్లో అలాంటి పెంపకం సాధ్యంకాదు. మరెలా..?
* చిన్న కుటుంబాల్లో పెరిగే పిల్లలు ఒంటరితనంతో బాధపడతారు. ఊరంటే ఒక ప్రాంతం కాదు, మనుషులు. పిల్లల్ని పెంచడానికి ఊరంతా తీసుకురాలేం కానీ తాతయ్యనీ, బామ్మనీ తీసుకురావచ్చు. వాళ్ల అనుభవం పిల్లల పెంపకంలోని సవాళ్లను ఎదుర్కొనడంలో సాయపడుతుంది. పిల్లల సంరక్షణకు బయటివారిమీద ఆధారపడితే ఆందోళనా ఆర్థికభారమూ కూడా. అదే సొంత మనుషులైతే అవేవీ ఉండవు.
* పెద్దలు దగ్గర ఉండడం సాధ్యం కాక పోయినా పిల్లలు వారి ప్రేమకి దూరం కానక్కర్లేదు. ఫోన్లూ టెక్నాలజీని అందుకు వాడుకోవచ్చు. వారానికోసారైనా వీడియోకాల్ చేసి పెద్దలతో మాట్లాడించాలి. అనుబంధాలే ఒంటరితనాన్ని దూరంచేస్తాయి.
* అచ్చం అమ్మానాన్నల్లాగా చూసుకునే బంధువులూ పిల్లలకు అవసరం. ‘హాలో పేరెంటింగ్’ అంటారు దీన్ని. తాతయ్యా బామ్మలో, పెదనాన్నో, మామయ్యో... అందుబాటులో ఉండే ఎవరో ఒకరు ఆ పాత్ర పోషించాలి. ఆ సాన్నిహిత్యం పిల్లలు పెద్దయ్యాక కూడా మనసు విప్పి తమ కష్టసుఖాలు చెప్పుకోవడానికి వీలు కల్పిస్తుంది.
* దొరికిన సమయమంతా పిల్లలకు ఏవో నేర్పించేయాలనీ, చదివించేయాలనీ తాపత్రయం కూడదు. పిల్లల ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి.
* తల్లిదండ్రులు తమ బిడ్డ ‘స్పెషల్, టాలెంటెడ్’ అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ పిల్లలు ‘స్పెషల్’గా కాదు, ‘సెక్యూర్’గా ఫీలవ్వాలి. తమ పిల్లలు ‘స్పెషల్’ అనుకునే తల్లిదండ్రులు వారి సామర్థ్యాలపైనే దృష్టిపెడతారు. ఇతరుల ముందు గొప్పగా వారి విజయాలను ప్రదర్శిస్తారు. దాంతో పిల్లలు ఒకలాంటి అభద్రతాభావంలోకి నెట్టివేయబడతారు. ఈ విజయాలు సాధించకపోతే అమ్మానాన్నా నన్ను ప్రేమించరేమో- అని దిగులుపడతారు. పిల్లల గెలుపుని కాకుండా వివిధ అంశాల్లో వారు చూపే చొరవని ప్రశంసించాలి.
జ్ఞానవారధి నిర్మించాలి :జ్ఞానం- బోధించేది కాదు, గ్రహించేది... అంటారు దాజీ. ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞానం ప్రసారమయ్యేది తల్లిదండ్రులనుంచి కాదు, తాతలూ బామ్మల నుంచేనట. దీనికి కారణం లేకపోలేదు... తల్లిదండ్రుల మీద ఉన్న సంపాదన బాధ్యతవల్ల పిల్లల్ని ఇంట్లో ఉన్న పెద్దల మీద వదిలేయడం మొదటినుంచి ఉన్నదే. అప్పుడు వేటకు వెళ్లేవారు, ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్తున్నారు. దాంతో పిల్లల వ్యక్తిత్వానికి పునాది పడే బాల్యం అంతా వారు తాతయ్యలూ, నాయనమ్మ, అమ్మమ్మల పర్యవేక్షణలోనే గడుపుతారు. వారి దగ్గరే జీవన నైపుణ్యాలను నేర్చుకుంటారు. నిత్యజీవితంలో చేసే పనుల్లోనే అనుభవంతో తాము నేర్చుకున్న మెలకువలను సందర్భాన్ని బట్టి చెబుతూ ఉంటారు పెద్దలు. ఆచరణలో నేర్చుకునే ఇలాంటి అంశాలు పిల్లల మీద చెరగని ముద్రవేస్తాయి. అందుకే పెద్దల్ని ‘లివింగ్ విజ్డమ్ బ్రిడ్జ్’ అంటారు దాజీ. ప్రతి ఒక్కరి దగ్గరా ఏదో ఒక నైపుణ్యం ఉండితీరుతుంది. దాన్ని నేర్చుకునే అవకాశం పిల్లలకు ఇవ్వాలి. పెద్దల అనుభవజ్ఞానాన్ని తర్వాత తరాలకు అందించేందుకు ఉన్న ఏకైక మార్గం అదే.
సన్నద్ధత అవసరం :ఏ వయసులో పిల్లల్ని కనాలీ అన్నది నేటి సమాజంలో చర్చనీయాంశం. స్త్రీ పురుషులిద్దరూ కెరీర్కి పెద్దపీట వేస్తూ పెళ్లినీ, పిల్లల్నీ వాయిదా వేస్తున్నారు. అవి వారి వ్యక్తిగత విషయాలే కావచ్చు. ఇక్కడ మనం పిల్లల కోణంలో మాత్రమే సమస్యను చూద్దాం. 35 ఏళ్లు దాటాక పుట్టే పిల్లల్లో శారీరక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. రెండోది- పిల్లల్ని పెంచడానికి చాలా ఓపికా శక్తీ కావాలి. వయసు పెరిగే కొద్దీ అవి తగ్గిపోతాయి. తల్లిదండ్రులకే కాదు, వారికి తోడ్పాటునందించే పిల్లల నానమ్మా అమ్మమ్మల వయసూ పెరుగుతుంది. దాంతో వాళ్లూ ఓపిగ్గా పెంచలేకపోవచ్చు. ఆలస్యంగా పిల్లల్ని కంటే వాళ్లు జీవితంలో స్థిరపడేసరికి తల్లిదండ్రులు వృద్ధులైపోతారు. మనవల ముద్దూ ముచ్చట్లను ఆస్వాదించలేరు. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగమూ ఆర్థిక విషయాల గురించి ఎలా ముందుగా ప్లాన్ చేసుకుంటామో అలాగే పిల్లల్ని ఆహ్వానించే సమయాన్నీ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే సంతోషంగా తల్లిదండ్రుల హోదాని ఆస్వాదించవచ్చు. వివాహబంధంలో తృప్తిగా ఆనందంగా ఉన్న జంటే మంచి తల్లిదండ్రులు కూడా కాగలరు. తల్లిదండ్రులు ఆనందంగా ఉంటే పిల్లలూ సంతోషంగా ఉంటారు. పిల్లలకు 50 శాతం సంతోషం జన్యుపరంగా తల్లిదండ్రులనుంచి వస్తే మిగిలిన 50 శాతం చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి వస్తుందట.
అమ్మ ఆనందమే..మహిళ గర్భం దాల్చిన విషయం తెలిసినప్పటినుంచీ కుటుంబసభ్యులూ బంధువులూ ఆమెను ప్రత్యేకంగా చూస్తారు. తినాలనిపించినవి చేసి పెడతారు. పుట్టింటికి తీసుకెళ్లి విశ్రాంతి ఇస్తారు. సీమంతమనో మరొకటనో వేడుకలు చేస్తారు. ఇవన్నీ ఆమెను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచడానికి చేసేవే. తల్లి సంతోషంగా ఉన్నప్పుడే కడుపులోని బిడ్డ సంతోషంగా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో డచ్ వాళ్లు ఆహార కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేలాది మంది ఆకలిచావులకు గురయ్యారు. ఆ పరిస్థితుల్లోనూ అక్కడి ఆస్పత్రులు రోగుల ఆరోగ్య రికార్డులను వివరంగా నమోదుచేశాయి. అప్పుడు గర్భిణులుగా ఉన్న దాదాపు 40వేల మంది మహిళలూ వారి పిల్లల ఆరోగ్యాల మీద ఎన్నో అధ్యయనాలు జరిగాయి. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎదుర్కొన్న పోషకాహారలేమి పలురకాల అనారోగ్యాల రూపంలో ఆ పిల్లల్ని జీవితకాలం వెంటాడిందని రుజువయ్యింది. మిగతా సమయాల్లో పుట్టిన పిల్లలతో పోలిస్తే అప్పుడు పుట్టినవారు ఎక్కువసార్లు ఆస్పత్రిలో గడపవలసి వచ్చిందట. గుండెజబ్బులు ఎక్కువగా వచ్చాయట. గర్భం దాల్చడమనేది కేవలం కాన్పు సాఫీగా అవడంతో అయిపోయే ప్రక్రియ కాదనీ బిడ్డ జీవితకాలపు ఆరోగ్యాన్ని గర్భంలో ఉన్నప్పటి సమయమే శాసిస్తుందనీ ఆ అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అందుకే గర్భిణికి మంచి ఆహారమూ విశ్రాంతీ ఇస్తూ శారీరకంగానూ మానసికంగానూ ఆమె ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. సంతోషంగా ఉన్న తల్లి బిడ్డని ప్రేమగా చూసుకుంటుంది. అది బిడ్డలో భద్రతకీ ప్రేమబంధానికీ పాదులు వేస్తుంది.
బాల్యం... వ్యక్తిత్వానికి పునాది..
పిల్లల మెదడు తొంభై శాతం మూడేళ్లలోపలే ఏర్పడుతుంది. ఆ వయసులోనే అది అయస్కాంతంలాగా అందిన సమాచారాన్నంతా గ్రహించేస్తుంది. భాష, అభిరుచి, ఆలోచన, విశ్లేషణానైపుణ్యాలు లాంటి ఎన్నో లక్షణాలకు గట్టి పునాది వేస్తుంది.
* కొందరు పిల్లలకు అన్నీ నేర్పించేసి బాలమేధావులుగా తయారుచేయాలని ఆత్రపడుతుంటారు. దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. నీళ్లున్నాయి కదా అని బిందెలకొద్దీ పోసేస్తే చెట్టు కాయలు కాయదు, అది కాసే సమయం వచ్చినప్పుడే కాస్తుంది. అలాగే పిల్లలూనూ. మనం చేయాల్సిందల్లా వారి చిన్ని మెదడుకి మేత వేయడం. కథలూ పాటలూ మాటలూ ఆటలతో బుర్రకి పదును పెట్టడం. ఆ చిన్ని మొక్క పెద్దదై తన ప్రతిభా పాటవాలతో అలరించే దాకా వేచి చూడడం.
* అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలు చెప్పేది వినాలి. రకరకాల ప్రశ్నలు అడిగి తప్పోఒప్పో మాట్లాడనివ్వాలి, సరిచేయకూడదు. తోటి పిల్లలతో ఆడుకోవాలి. అదే సమయంలో తల్లిదండ్రులూ తమ స్నేహితులతో పిల్లల పెంపకంలో అనుభవాలను పంచుకోవాలి. అంతే కానీ పోల్చుకోకూడదు. పిల్లలందరూ ఎవరికి వారే ప్రత్యేకం.