తెలంగాణ

telangana

By

Published : May 2, 2020, 10:29 AM IST

ETV Bharat / state

ఏపీలో నీటి కటకట... గొంతు తడిసే దారేది

మండుతున్న ఎండలు...కానరాని వానలు...అడుగంటిన భూగర్భజాలలు...వెరసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. గొంతు తడుపుకునేందుకు వ్యవసాయబావులపై ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా 8 జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.

drinking-water-is-a-serious-problem-in-the-state
గొంతు తడిసే దారేది

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో తాగునీటి కష్టాలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. చుక్కనీరు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు.

వ్యవసాయ బావులే ఆధారం

భూగర్భ జలాలు అడుగంటడంతో గ్రామీణ రక్షిత తాగునీటి పథకాలకు కష్టకాలమొచ్చింది. వ్యవసాయ బావుల్లోని నీటితో వీటికి ఊపిరి పోస్తున్నారు. ఎనిమిది జిల్లాల్లోని 326 ఆవాస ప్రాంతాలకు ప్రస్తుతం ఇదే విధంగా తాగునీరు అందిస్తున్నారు. వ్యవసాయ బావుల్లో అందుబాటులో ఉన్న నీటితో వచ్చే నెల 15 వరకు నెట్టుకురావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటికీ వర్షాలు రాకపోతే మరింత ఎద్దడి ఎదుర్కోక తప్పని పరిస్థితి. అనంతపురం, కర్నూలు, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం, శ్రీకాకుళం, కడప, గుంటూరు జిల్లాల్లో కొన్ని మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. ఇక్కడ గ్రామీణ రక్షిత తాగునీటి పథకాలు పని చేయడం లేదు.

రాయలసీమలో సమస్య తీవ్రం...

చిత్తూరు జిల్లాలో సమస్య తీవ్రంగా ఉంది. దీన్ని అధిగమించే క్రమంలో సమీపంలోని వ్యవసాయ బావుల్లో నుంచి నీటిని వినియోగించుకునేలా అధికారులు రైతుల అంగీకారం తీసుకుంటున్నారు. 343 బావుల నుంచి రక్షిత నీటి పథకాల వరకు తాత్కాలికంగా పైపులు వేస్తున్నారు. వేసవి తీవ్రత పెరగడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని మరో 2,792 ఆవాస ప్రాంతాలకు అధికారులు రోజూ ట్యాంకర్లు పంపుతున్నారు. ఏడు జిల్లాల్లో రోజూ 13,253 ట్రిప్పుల నీటిని ప్రస్తుతం ఇలా అందిస్తున్నారు. రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. చిత్తూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పశువుల గొంతులూ ట్యాంకర్లతోనే తడుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details