తెలంగాణ

telangana

By

Published : Apr 18, 2020, 5:01 AM IST

Updated : Apr 18, 2020, 4:15 PM IST

ETV Bharat / state

చాపకింద నీరులా కరోనా.. వారంరోజుల్లో 279 కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం మరో 66 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత వారం రోజుల్లోనే రాష్ట్రంలో 279 మందిలో వైరస్ నిర్ధరణ అయింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 417 కేసులున్నాయి. పాతబస్తీలో తలాబ్‌కట్టలో ఒకే కుటుంబంలో 31 కేసులు నమోదయ్యాయి. ఒకరి ద్వారానే 34 మందికి సోకినట్లు అధికారులు నిర్ధరించారు.

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి.. వారం రోజుల్లో 279 మందికి నిర్ధరణ
రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి.. వారం రోజుల్లో 279 మందికి నిర్ధరణ

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నెల 13 వరకు 500లకు చేరిన సంఖ్య... గడచిన నాలుగు రోజుల్లోనే సుమారు 800 మార్కుకు చేరువైంది. శుక్రవారం ఒక్కరోజే 66 మందికి వైరస్‌ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో దాదాపు 46 కేసులు జీహెచ్​ఎంసీ పరిధిలోనివే. వీటితో ఇప్పటి వరకు మొత్తం బాధితుల సంఖ్య 766కి చేరింది. ఈనెల 13న రాష్ట్రంలో 472 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా శుక్రవారానికి ఆ సంఖ్య 766కి చేరింది. అంటే గడచిన నాలుగు రోజుల్లోనే 294 మందికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 186. ఈ నెల 13 నాటికి ఆ సంఖ్య 103గా ఉంది. అంటే గత నాలుగు రోజుల్లో కోలుకున్న వారి సంఖ్య 83 మంది కాగా.. ఒకరు కరోనాకు బలయ్యారు. 120 మంది వరకు కోలుకుని డిశ్చార్జ్ అవుతారని భావించినా.. 68 మందికి మాత్రమే రెండో దఫా కరోనా టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని అధికారులు ప్రకటించారు.

ఒకరి ద్వారా 34 మందికి..

ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తిచెందుతున్న వైరస్‌ మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నెల 10న మృతిచెందిన పాతబస్తీలోని తలాబ్ కట్టకు చెందిన ఓ వృద్ధురాలి ద్వారా మొత్తం 34 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇందులో 31 మంది కుటుంబసభ్యులే ఉండగా... ఆమెకు చికిత్స చేసిన ఇద్దరు ప్రైవేటు ఆసుపత్రి నర్సులు ఉన్నారు. ఓ వైద్యురాలికి పాజిటివ్‌ రాగా అధికారికంగా నిర్ధరించాల్సి ఉంది.

గాంధీ వైద్య కళాశాల విద్యార్థికి కోవిడ్​:

సూర్యాపేట జిల్లాలో మరో 15 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్‌ నిర్ధరించారు. వీరందరు పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో పాజిటివ్‌ వ్యక్తులకు సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్‌గా అధికారులు గుర్తించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని ఈ-గ్రంథాలయంలో పనిచేస్తున్న యాకుత్‌పురాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా ఉందని తేలడం వల్ల అంతా ఉలిక్కిపడ్డారు. ఆసుపత్రిలో నిత్యం 300 మంది వైద్యులు, 400 మంది నర్సులు, 500 మంది నాలుగో తరగతి సిబ్బంది, వైద్య విద్యార్థులు విధులు నిర్వర్తిస్తుంటారు. ఇతను ఎవరితో సన్నిహితంగా ఉన్నాడని అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

గద్వాలలో మరో ఇద్దరికి..

జోగులాంబ గద్వాల జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ రాష్ట్రం కర్నూలులో కరోనా పాజిటివ్‌తో ఇటీవల మృతిచెందిన ప్రముఖ వైద్యుడి వద్దకు వెళ్లిన గద్వాలకు చెందిన వ్యక్తికి వైరస్ సోకినట్లు తేలింది. గద్వాలకు చెందిన మరో వ్యక్తికి కూడా వైరస్‌ వచ్చినట్లు నిర్ధరించారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి నుంచి కుమురం భీం జిల్లా జైనూరు తపాలాశాఖ బీపీఎంకు కరోనా వైరస్ సోకింది. పింఛన్ పంపిణీతో పాటు, ఉత్తరాల బట్వాడా ఎవరెవరికీ చేశారనే కోణంలో ఆరా తీస్తున్నారు. గ్రీన్ జోన్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైనట్లు గుర్తించారు. ఐతే వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌లో మాత్రం దీనిని నిర్ధరించలేదు.

ఇదీ చూడండి:సీసీసీకి రామోజీరావు విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన చిరు

Last Updated : Apr 18, 2020, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details