తెలంగాణ

telangana

By

Published : Jul 29, 2020, 7:44 AM IST

ETV Bharat / state

గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

కరోనా కేసులు పెరుగుతుండటంతో గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఐసొలేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అనుమానిత లక్షణాలు, లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చిన, స్వల్ప లక్షణాలున్న, ముందస్తు లక్షణాలు కలిగిన వారికి ఇక్కడ చికిత్స అందిస్తారు. కరోనా ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించడంలో భాగంగా కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. వీటిని నివాస సంక్షేమ సంఘాలు సొంతగా లేదా ఎన్జీవోల సహకారంతో ఏర్పాటు చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ పలు సూచనలు జారీ చేసింది.

Corona Treatment at gated‌ communities
గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఐసొలేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. నివాస ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. వీలైనంత వరకు సందర్శకులను తగ్గించాలని, అందరికీ థర్మల్‌ స్కానింగ్‌ చేయాలని పేర్కొంది. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, ఇతర వ్యాధులున్న వారిని ఇంటికే పరిమితం చేయాలని వెల్లడించింది. ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరి చేయడంతో పాటు లక్షణాలుంటే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని తెలిపింది. స్థానికంగా ఏర్పాటు చేసే కరోనా చికిత్స కేంద్రాలకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలంది. నిరంతర పర్యవేక్షణ బృందాలు, అంబులెన్స్‌లు, డాక్టర్లు, నర్సుల ఫోన్‌నంబర్లు అందుబాటులో ఉంచాలని వివరించింది.

స్థానిక యంత్రాంగానికి ముందుగా సమాచారం

  • ఐసొలేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ముందుగా జిల్లా యంత్రాంగానికి సమాచారమివ్వాలి. జిల్లా ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందం అక్కడికి వచ్చి సౌకర్యాలపై మదింపు చేస్తుంది. లోపాలుంటే సూచనలిస్తుంది.
  • కేంద్రం ఏర్పాటు చేసిన తరువాత కూడా ఏమైనా లోపాలు కనిపించినా, సరిగా లేదని అనుమానం వచ్చినా వెంటనే అనుమతి ఉపసంహరించుకుంటుంది.
  • కమ్యూనిటీహాల్‌, ఉమ్మడి వినియోగ కేంద్రం, ఖాళీగా ఉన్న ఫ్లాట్లను కరోనా చికిత్స కేంద్రాలుగా చేయవచ్చు.
  • కరోనా కేంద్రంలో ఒక్కో మంచానికి మధ్య మీటరు దూరం ఉండాలి. వ్యాధి నిర్థారణ అయినవారిని, అనుమానిత లక్షణాలున్న వారిని వేర్వేరుగా ఉంచాలి.
  • కొవిడ్‌ చికిత్స కేంద్రాలుగా గుర్తించిన ప్రదేశానికి సహజసిద్ధ వెంటిలేషన్‌ ఉండాలి. ఒకవేళ లేకుంటే ఖాళీ ప్రదేశానికి అక్కడి గాలి వెళ్లేలా ఎగ్జాస్ట్‌ ఫ్యాన్స్‌ పెట్టుకోవచ్చు. ఏసీలు 24-30 డిగ్రీల మధ్య, గాలిలో తేమ 40-70 శాతం ఉండాలి.
  • కరోనా బాధితులు, అనుమానితులకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఉండాలి.
    ఈ జాగ్రత్తలు తప్పనిసరి
  • ఐసొలేషన్‌ కేంద్రంలో ప్రతిరోజూ వైద్యుడు రోగులను పరిశీలించి చికిత్స అందించాలి.
  • వైద్యులు, సేవకులుగా ఎంపిక చేసిన వారు ఐగోట్‌ https:-//diksha.gov.in/igot/ ద్వారా కరోనా కేంద్రాల నిర్వహణ, వైరస్‌ నివారణ, నియంత్రణ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. నమూనాల సేకరణ, ప్యాకేజింగ్‌, రవాణా తదితరాలపై స్థానిక ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు సహాయం చేస్తాయి.
  • పీపీఈ కిట్లు మార్చుకునేందుకు ప్రత్యేక గది ఉండాలి. పీపీఈ కిట్లు, మాస్కుల నిర్వహణను బయోమెడికల్‌ వ్యర్థాల నిబంధనల మేరకు చేపట్టాలి. వినియోగించిన దిండుకవర్లు, తువాళ్లను డిస్పోజబుల్‌ బ్యాగులో 72 గంటలు పెట్టి, ఆ తరువాత వాటిని రోగి ఇంట్లో సబ్బుతో ఉతకాలి.
  • రోగులు ముట్టుకునే ఉపరితలాన్ని ఎప్పటికప్పుడు రసాయనిక శుద్ధి చేయాలి. ఉమ్మడి ప్రదేశాలను రోజుకు రెండుసార్లు శుభ్రం చేయాలి. మూడుసార్లు శుద్ధి చేస్తే మంచిది.
  • బాధితులు ఎల్లప్పుడూ మూడు పొరల మాస్కు ధరించాలి. బాధితునికి శ్వాసకోశ ఇబ్బందులున్నాయా? పల్స్‌రేటు, ఆక్సిజన్‌, శరీర ఉష్ణోగ్రత పరిశీలించాలి. తేడా ఉంటే అత్యవసర వైద్య సహాయానికి తరలించాలి.
  • బాధితుల రికార్డులు నిర్వహించాలి. ఉదయం, సాయంత్రం పల్స్‌, శ్వాస, శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ తదితర వివరాలు నమోదు చేయాలి. సీసీటీవీ సహాయంతో బాధితులు ఈ కేంద్రం నుంచి బయటకు రాకుండా పర్యవేక్షించాలి.
  • ఆహారాన్ని డిస్పోజబుల్‌ ప్లేట్ల ద్వారా అందించాలి.
  • కేంద్రంలో చేరిన అనుమానిత వ్యక్తికి నెగిటివ్‌ వచ్చినపుడు అతన్ని వైద్యుడి సూచనల మేరకు ఇంటికి పంపించడమో లేదా నాన్‌కొవిడ్‌ కేంద్రానికి సిఫార్సు చేయడమో చేయాలి. పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స అనంతరం వైద్యఆరోగ్యశాఖ నిబంధనల మేరకు డిశ్ఛార్జి చేయాలి.

వీరికి కరోనా ఆస్పత్రుల్లోనే..

పదేళ్లలోపు చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, ఇతర వ్యాధులున్న వారికి కొవిడ్‌ సోకితే ఈ చికిత్స కేంద్రాల్లో చేర్చకూడదు. తప్పనిసరిగా కరోనా ఆస్పత్రులకు తరలించాలి.

ABOUT THE AUTHOR

...view details