Revanth reddy letter to KCR: స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పంచాయతీలకు ఇచ్చే నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. ప్రభుత్వం సర్పంచుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించిన రేవంత్... రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న ఆయన... నిధులు విడుదల చేసి పంచాయతీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగచాటుగా దారి మళ్లించిందని, ప్రతి నెలా విడుదల చేయాల్సిన రూ.250 కోట్లు గడిచిన 5 నెలలుగా విడుదల చేయలేదని ఆరోపించారు. దీంతో గ్రామ పంచాయతీల పరిస్థితి అద్వాన్నంగా మారిందని, అభివృద్ధి పనులలో చాలా వరకు బిల్లులు పెండింగులో ఉన్నాయని విమర్శించారు.