యాదాద్రి ప్రధాన ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తికానుందని... ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రారంభోత్సవంలో చినజీయర్ స్వామి సమక్షంలో 1008 కుండాలతో మహా సుదర్శన యాగం నిర్వహిస్తామని వివరించారు. ప్రపంచ వైష్ణవ పీఠాల నుంచి స్వాములను పిలిపించాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు.రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చినజీయర్స్వామి ఆశ్రమంలో తిరునక్షత్ర వేడుకల్లో కుటుంబ సమేతంగా కేసీఆర్ పాల్గొన్నారు. చిన జీయర్ స్వామిని దర్శించుకుని ఆశీసులు పొందారు.
చినజీయర్ స్వామిని తిరునక్షత్ర సుముహూర్తాన దర్శించుకోవటం భాగ్యమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. స్వామివారి సేవలు కొనియాడిన కేసీఆర్... తన గురువులు, వివాహం, సంప్రదాయాల గురించి వివరించారు. సీఎం కేసీఆర్ సకుటుంబంగా వేడుకల్లో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు చినజీయర్ స్వామి. సత్య సంకల్ప గ్రంథాన్ని కేసీఆర్కు బహుకరించారు. అద్బుతమైన కార్యక్రమాలు చేస్తూ... రాజకీయ నాయకుల్లో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారని ప్రశంసించారు. దేశంలోనే యాదాద్రి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని మరికొన్ని ఆలయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్వామిజీ అభిప్రాయపడ్డారు.