తెలంగాణ

telangana

ETV Bharat / state

CM Kcr: రంగంలోకి సీఎం కేసీఆర్... కేంద్రం కీలక ఉత్తర్వులు

బియ్యం సేకరణపై నెలకొన్ని సందిగ్ధతకు తెరపడింది. కేసీఆర్ రంగంలోకి దిగడంతో కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఫలితంగా.. సుమారు నెలరోజులుగా సాగుతున్న తంతుకు ముగింపు దొరికింది. వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి మిల్లర్ల వద్ద ఉన్న బియ్యం తీసుకునే విషయంలో తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం ఓకే చెప్పేసింది. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ  నెలన్నరకుపైగా గడువు ఇచ్చింది.

By

Published : Oct 14, 2021, 9:00 AM IST

Updated : Oct 14, 2021, 10:02 AM IST

central-government-issuing-orders-on-extension-of-deadline-for-collection-of-rice
central-government-issuing-orders-on-extension-of-deadline-for-collection-of-rice

రాష్ట్ర ప్రభుత్వ యత్నాలు ఫలించాయి. బియ్యం సేకరణకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గడువు పెంచింది. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేసింది. యాసంగి సీజనులో రాష్ట్రం భారీగా 92 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వాటి నుంచి 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం వస్తాయి. కేంద్రం 24.75 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే తీసుకుంటామని చెప్పింది. దిగుబడి భారీగా రావటంతో కనీసం 50 లక్షల మెట్రిక్‌ టన్నులవరకైనా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకోగా 20 లక్షల మెట్రిక్‌ టన్నులను అదనంగా తీసుకునేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే క్షేత్రస్థాయిలో ధాన్యం నిల్వలను లెక్కించిన మీదటే అదనపు ధాన్యం తీసుకుంటామని స్పష్టం చేసింది. 225 మిల్లులను ఎంపిక చేసి పౌరసరఫరాల శాఖ ఇచ్చిన జాబితా మేరకు భారత ఆహార సంస్థ అధికారులు తనిఖీల ప్రక్రియను పూర్తి చేసి నివేదిక ఇవ్వటంతో బియ్యం తీసుకునేందుకు గడువును పొడిగిస్తూ కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

యాసంగి బియ్యానికి 48 రోజులు

యాసంగి (రబీ)లో అదనపు కోటా కలుపుకొని బియ్యం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం 48 రోజులు (నవంబరు 30 వరకు) గడువు ఇచ్చింది. ఇప్పటివరకు ఎఫ్‌సీఐకి 21 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఇచ్చారు. మిగిలిన మూడు లక్షల మెట్రిక్‌ టన్నులతోపాటు అదనంగా మరో 20 లక్షల మెట్రిక్‌ టన్నులు ఇవ్వాల్సి ఉండటంతో అంత గడువు నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది. వానా కాలం (ఖరీఫ్‌) సీజనుకు సంబంధించి సుమారు 32 వేల మెట్రిక్‌ టన్నుల మాత్రమే ఉండటంతో ఈ నెల 31 వరకు గడువు ఇచ్చింది. నిర్ధారిత గడువులోగా మిల్లర్ల నుంచి బియ్యం ఎఫ్‌సీఐకి చేర్చేలా చూడాల్సిన బాద్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని పేర్కొంది.

రీ సైకిల్డ్‌ బియ్యం రాకుండా చూడాలి

రీ సైకిల్డ్‌ బియ్యాన్ని మిల్లర్లు మళ్లీ ఎఫ్‌సీఐకి ఇవ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. ఎఫ్‌సీఐ అధికారులు కూడా బియ్యాన్ని తనిఖీ చేయాలని సూచించింది. ఈ తనిఖీల్లో నిర్ధారించిన మొత్తాన్ని మాత్రమే కేంద్ర కోటా బియ్యంగా పరిగణిస్తామని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:Alternatives for Rice cultivation : 'వరి నుంచి మళ్లడం రైతులకు సులభం కాదు.. కానీ...'

Rabi crops in Telangana : 'యాసంగిలో వరి సాగు వద్దు'

Last Updated : Oct 14, 2021, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details