తెలంగాణ

telangana

25న అపెక్స్ కౌన్సిల్ భేటీ.. కృష్ణా గోదావరి జల వివాదాలపై చర్చ!

By

Published : Aug 15, 2020, 6:37 AM IST

తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా, గోదావరి జల వివాదాలపై చర్చించేందుకు ఈ నెల 25న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు అంగీకారం అయితే ఆ తేదీన భేటీ నిర్వహణకు ఏర్పాట్లు చేయమని కేంద్రజల్‌శక్తి మంత్రి సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం.

apex-council-meet-on-august-25th
25న అపెక్స్ కౌన్సిల్ భేటీ.. కృష్ణా గోదావరి జల వివాదాలపై చర్చ!

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్‌కు కేంద్ర జల్‌శక్తి మంత్రి ఛైర్మన్‌ కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు సభ్యులు. మొదటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం 2016లో జరగ్గా తర్వాత ఇప్పటివరకు మరోటి నిర్వహించలేదు. ఈ నెల ఐదున జరపాలని నిర్ణయించగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వీలుకాకపోవడంతో వాయిదా వేశారు. ఆగస్టు 20 తర్వాత ఎప్పుడైనా నిర్వహించాలని కేసీఆర్‌ సూచించగా, ఎప్పుడైనా సమ్మతమేనని ఆంధ్రప్రదేశ్‌ సీఏం జగన్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో 25న భేటీ నిర్వహించడానికి అనుకూలంగా ఉందని జల్‌శక్తి మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం, తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండు నెలలుగా కృష్ణా, గోదావరి జలాలపై పరస్పర ఫిర్యాదులు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. జూన్‌ మొదటి వారంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశంలో కొత్త ప్రాజెక్టులపై చర్చించాక వాటి డీపీఆర్‌లు అందజేయాలని బోర్డులు కోరాయి. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సూచన మేరకు ఈ ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని అవి సూచించినా రెండు రాష్ట్రాల నుంచి స్పందన కనిపించలేదు. కొత్త ప్రాజెక్టులే లేనప్పుడు డీపీఆర్‌లు ఎలా ఇస్తామని అవి అంతకు ముందే పేర్కొన్నాయి.

17న బోర్డుల ఛైర్మన్లతో జల్‌శక్తి శాఖ సలహాదారు సమావేశం!
రాయలసీమ ఎత్తిపోతల టెండరు ప్రక్రియ నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్‌కు, గోదావరిపై చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు ఆపాలని తెలంగాణకు సూచిస్తూ కేంద్రజల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ స్వయంగా లేఖ రాయడంతో ముఖ్యమంత్రులు తీవ్రంగానే స్పందించారు. ఈ నేపథ్యంలో రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రాధాన్యం సంతరించుకొంది. మరోవైపు పునర్విభజన తర్వాత ఏర్పాటైన బోర్డుల పరిస్థితి, ఆచరణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి తదితర అంశాలపై చర్చించేందుకు జల్‌శక్తి మంత్రిత్వశాఖ సలహాదారు వెదిరే శ్రీరాం ఈ నెల 17న కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లతో హైదరాబాద్‌లో సమావేశం కానున్నట్లు తెలిసింది. బచావత్‌ ట్రైబ్యునల్‌, బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌, ప్రాజెక్టులకు కేటాయింపులు తదితర అంశాలన్నింటిపై చర్చించి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఓ అభిప్రాయానికి రావడానికి ఈ భేటీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి:రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన తహసీల్దార్

ABOUT THE AUTHOR

...view details