తెలంగాణ

telangana

ఆనందయ్య ఔషధం.. రహస్య తయారీ..!

By

Published : May 26, 2021, 2:39 PM IST

ఏపీలోని కృష్ణపట్నం ఆనందయ్య మందు కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. పరిశోధనలు జరిగేవరకు ఆపాలన్న ఆదేశాలతో ఔషధ పంపిణీ నిలిచిపోయింది. అయితే.. ఆనందయ్యతో పాటు.. ఆయన శిష్యులు రహస్యంగా ఔషధాన్ని తయారు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

anandhayya-medicine-preparation-going-on-secretly
ఆనందయ్య ఔషధం.. రహస్య తయారీ..!

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో.. కరోనా రోగుల కోసం ఆనందయ్య రూపొందించిన ఔషధం దేశంలోనే హాట్ టాపిక్‌గా మారింది. మందు కోసం వేలాది మంది ఎగబడ్డారు. భారీగా జనం తరలివెళ్లారు. రద్దీని అదుపు చేసేందుకు.. కొవిడ్‌ వ్యాప్తి, ఆనందయ్య మందుపై పరిశోధనల పేరుతో పంపిణీని ఆపివేశారు. అప్పటి నుంచి ఆనందయ్య ఔషధం పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. అయితే అనుమతుల మాట ఎలా ఉన్నా మందును అనధికారికంగా తయారు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో రహస్యంగా.. ఆనందయ్య స్వయంగా మందు తయారు చేస్తున్నారని కొందరు చెబుతున్నారు.'

శిష్య బృందంతో కలిసి

కృష్ణపట్నంలో ఆనందయ్య గత కొన్ని నెలలుగా.. కరోనా బాధితుల కోసం మందును తయారుచేస్తున్నారు. ఆయన వద్ద వైద్యం నేర్చుకున్న 20 మంది శిష్య బృందం సైతం మరో ప్రాంతంలో మందును తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్, కృష్ణపట్నం, చిల్లకూరు పరిసర ప్రాంతాలతో పాటు మరికొన్నిచోట్ల.. రహస్యంగా తయారు చేస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధులకు మందును పంపిణి చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరోవైపు... నేరుగా మందు పంపిణీ జరగని తీరును అవకాశంగా తీసుకుని... కొందరు బ్లాక్‌మార్కెట్లో ఆనందయ్య ఔషధాన్ని విక్రయిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కంటి చుక్కల మందును వేలాది రూపాయలకు అమ్ముతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:ఆనందయ్య ఔషధంపై తితిదే ఆధ్వర్యంలో పరిశోధనలకు నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details