తెలంగాణ

telangana

By

Published : May 8, 2020, 12:01 AM IST

ETV Bharat / state

'రెడ్​ జోన్లలో మద్యం విక్రయాలు నిలిపివేయండి'

మద్యం వల్ల కరోనా వ్యాప్తి పెరిగితే ముఖ్యమంత్రి కేసీఆరే దానికి బాధ్యత వహించాలని అఖిలపక్షం డిమాండ్‌ చేసింది. రెడ్‌ జోన్లలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని కోరింది. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలను అఖిలపక్షం తీవ్రంగా ఖండించింది. చిల్లర రాజకీయాలు ఎవ్వరివో ప్రజాక్షేత్రంలోనే తేలుతుందని హెచ్చరించింది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కోదండరాం నేతృత్వంలో ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడుతామని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు.

అఖిలపక్ష సమావేశం
అఖిలపక్ష సమావేశం

రైతు రాజ్యం ముసుగులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాచరిక పాలన సాగిస్తున్నారని అఖిలపక్షం ఆరోపించింది. ప్రతిపక్ష పార్టీలు ఏం చేయాలన్నా లాక్‌డౌన్‌ నిబంధనలు గుర్తుకు వస్తున్నాయని.. అధికార పార్టీ నిబంధనలు అతిక్రమించినా.. అధికారులకు కనబడటం లేదని మండిపడ్డారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ఐక్యంగా పనిచేస్తామని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. లాక్‌డౌన్‌ పొడిగించి మద్యం అమ్మకాలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రెడ్‌ జోన్‌లలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని, పేదల కరెంట్‌ బిల్లులు మాఫీ చేయాలని, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వంలోని పెద్దల ప్రోత్సాహంతోనే ఇసుక అక్రమ రవాణా సాగుతోందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. మద్యపానం వల్ల గృహా హింస, అత్యాచారాలు పెరిగితే కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలపై సీఎస్‌ను కలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయంటూ అవహేళనగా చేయడం రాచరిక పాలనకు నిదర్శనమని తెతెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ విమర్శించారు. పేదల ఆరోగ్యం పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనల మేరకు ముందుకుపోవాలన్నారు.

ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఖరి మార్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి సూచించారు. ట్రేస్‌, టెస్ట్, ట్రీట్‌ చేయమనడమే ప్రతిపక్షాలు చేసిన తప్పా.. అని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులకు పది వేల రూపాయలు 11 తేదీలోగా ఇవ్వకపోతే 12న అఖిలపక్షాల ఆధ్వర్యంలో లేబర్‌ ఆఫీస్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడం నిరంతర ప్రక్రియని... ఇది తెలంగాణలో మొదటిసారి కాదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ఘోరంగా విఫలమైందన్నారు.

కరోనా పాటిజివ్‌ కేసుల సంఖ్య ప్రకటించడంలో పారదర్శకత లేదని అఖిలపక్షం ఆరోపించింది. ప్రతిపక్షాలకే కాదు ప్రజలకు ఎన్నో సందేహాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేసి వాటిని నివృత్తి చేయాలని డిమాండ్‌ చేసింది.

ఇదీచూడండి:విశాఖ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

ABOUT THE AUTHOR

...view details