రైతు రాజ్యం ముసుగులో ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారని అఖిలపక్షం ఆరోపించింది. ప్రతిపక్ష పార్టీలు ఏం చేయాలన్నా లాక్డౌన్ నిబంధనలు గుర్తుకు వస్తున్నాయని.. అధికార పార్టీ నిబంధనలు అతిక్రమించినా.. అధికారులకు కనబడటం లేదని మండిపడ్డారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ఐక్యంగా పనిచేస్తామని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. లాక్డౌన్ పొడిగించి మద్యం అమ్మకాలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రెడ్ జోన్లలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని, పేదల కరెంట్ బిల్లులు మాఫీ చేయాలని, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలోని పెద్దల ప్రోత్సాహంతోనే ఇసుక అక్రమ రవాణా సాగుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మద్యపానం వల్ల గృహా హింస, అత్యాచారాలు పెరిగితే కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై సీఎస్ను కలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయంటూ అవహేళనగా చేయడం రాచరిక పాలనకు నిదర్శనమని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. పేదల ఆరోగ్యం పట్ల కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే డబ్ల్యూహెచ్ఓ నిబంధనల మేరకు ముందుకుపోవాలన్నారు.