మానవాళి మనుగడకు అతి ముఖ్యమైన మంచి నీటిని శుద్ధి చేసి ఆవాసాలకు అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా సురక్షిత మంచినీటిని సరఫరా చేయడంలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన్ని దక్కించుకొంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు చెందిన జల్జీవన్ మిషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలోని 98.3 శాతం ఆవాసాలకు శుద్ధి చేసిన నదీజలాలను నల్లాల ద్వారా అందిస్తున్నట్లు ప్రకటించింది.
అగ్రభాగాన నిలిచి..
తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేసిన మిషన్ భగీరథ రాష్ట్రాన్ని సమున్నత స్థానంలో నిలిపించింది. ఇంటింటికీ శుద్ధి చేసిన నదీజలాలను నల్లాల ద్వారా అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ భగీరథయత్నం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపింది. నల్లా కనెక్షన్లలో దేశ సగటు 27.28 శాతం ఉండగా... కేవలం 2.05 శాతంతో పశ్చిమబంగ చివరి స్థానంలో ఉంది. తెలంగాణ తర్వాత 89.05 శాతంతో గోవా రెండోస్థానంలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి 87.02తో మూడు, 79.78 తో హర్యానా నాలుగోస్థానంలో నిలిచాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ 74.16శాతం ఆవాసాలకు నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తూ ఐదోస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 1,897.93 లక్షల ఆవాసాలు ఉండగా 517.97 లక్షల ఆవాసాలకు నల్లాల ద్వారా తాగునీరు అందుతున్నట్లు జల్జీవన్ మిషన్ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో తక్కువే..