తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచే రైతుబంధు పెట్టుబడి సాయం

తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు అందించే 'రైతుబంధు' పెట్టుబడి సాయాన్ని నేటి నుంచి రైతుల ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు. ఎకరానికి ఐదువేలు జమ చేసేవిధంగా రూ.6,900 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

By

Published : Jun 4, 2019, 7:15 AM IST

నేటి నుంచే రైతుబంధు పెట్టుబడి సాయం

తొలకరి జల్లు పలకరిస్తున్న వేళ ఏరువాక కోసం రైతన్నకు భరోసానిచ్చేలా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం కింద రూ. 6వేల 900 కోట్లు విడుదల చేసింది. వీటిని మంగళవారం నుంచే రైతు ఖాతాల్లో జమ చేసేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. ఎకరానికి ఐదువేల చొప్పున రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. గతేడాది నాలుగువేలు ఉన్న పెట్టుబడి సాయాన్ని ప్రస్తుతం రూ. ఐదు వేలకు పెంచారు. మొత్తం కోటీ 38 లక్షల ఎకరాలకు సరిపడా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇవి సరిపోక ఇంకా రైతులు మిగిలితే వారికి ఇచ్చేందుకు కూడా సముఖంగానే ఉంది.

రెవెన్యూ శాఖ ఇప్పటికే 54.60 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందించింది. వీరితో పాటు ఇంకా మిగిలిన వారికి ఇచ్చేందుకు ధరణి పోర్టల్​లో తాహసీల్దార్లు డిజిటల్ సంతకం చేశారు. ఇలా సంతకాలు పూర్తైన రైతులకు సైతం రైతు బంధు ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. వీరే కాకుండా అటవీ భూమి యాజమాన్య హక్కు కలిగిన వారి ఖాతాల్లోనూ వేయనున్నారు.

దశల వారీగా ఖాతాల్లోకి...

నగదు పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా గతేడాదిలాగే ఈసారి కూడా నగదును దశల వారీగా రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. నెలాకరులోగా అందరి ఖాతాల్లో నగదు బదిలీ చేస్తామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు.

ఇంకా సులభతరంగా...

గతేడాది ఖరీఫ్ సీజన్​లో రైతులకు నేరుగా చెక్కులను పంపిణీ చేసింది ప్రభుత్వం. తర్వాత రబీ సీజన్​లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నేరుగా రైతుల ఖాతాలోకే జమచేశారు. ఇప్పుడు కూడా నేరుగా రైతుల ఖాతాలోకే జమ చేయనున్నారు. ప్రస్తుతం ఆర్బీఐకి చెందిన ఈ-కుబేర్ ద్వారా రైతు ఖాతాలోకి డబ్బు జమ చేశాక చరవాణికి మెసేజ్ వస్తుంది.

ఏ రైతుకైనా పెట్టుబడి సాయం అందకపోతే వ్యవసాయ విస్తరణ అధికారిని గానీ... మండల వ్యవసాయాధికారిని సంప్రదించాలని వ్యవసాయ మఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు.

ఇవీ చూడండి:కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు కేసీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details