people died in Football match: కామెరూన్లో దారుణం చోటు చేసుకుంది. ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చి ఎనిమిది మంది మృత్యువాత పడగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. నిన్న(సోమవారం) ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం భారీగా ప్రేక్షకులు వచ్చారు. కామెరూన్లోని పాల్బియా స్టేడియం సామర్థ్యం 60వేలు. కరోనా నేపథ్యంలో 60 శాతం మందినే నిర్వాహకులు అనుమతిచ్చారు. అయితే బయటి గేటు వద్ద భారీగా ప్రేక్షకులు వేచి ఉండటం వల్ల నిబంధనను సడలిస్తూ 80 శాతం మందికి అనుమతించారు. అయితే ప్రేక్షకులు లోపలికి వస్తుండగా.. ఫ్యాన్ జోన్ ప్రాంతంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు. అందులో చాలా మంది చిక్కుకున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
"ఇప్పటి వరకు చిన్నారి సహా 8 మంది మృతి చెందారు. దాదాపు 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సంఘటనాస్థలానికి అంబులెన్స్లను తరలించాం. అయితే భారీ ట్రాఫిక్ వల్ల ఆసుపత్రికి తరలించేందుకు కాస్త సమయం పట్టింది" అని కామెరూన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. సంఘటనపై దర్యాప్తు చేపట్టి మరిన్ని వివరాలను తెలియజేస్తామని కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్బాల్ (సీఏఎఫ్) తెలిపింది. యౌండే ఆసుపత్రిలోని బాధితులను పరామర్శించేందుకు తమ ప్రధాన కార్యదర్శిని పంపిస్తామని సీఏఎఫ్ పేర్కొంది.