తెలంగాణ

telangana

సేమ్​ టోర్నీ అదే జట్టు, నాడు స్ట్రెచర్‌పై ఆస్పత్రికి, ఇప్పుడు చెలరేగిపోయి

By

Published : Aug 29, 2022, 3:18 PM IST

Updated : Aug 29, 2022, 3:25 PM IST

2018లో జరిగిన భారత్​ పాక్​ మ్యాచ్​లో రెండు దురదృష్టకరమైన విషయాలు జరిగాయి. ఒకటి ఆ మ్యాచ్​ ఓడటం, రెండోడి అద్భుత ఆల్​రౌండర్​ హార్దిక్​కు​ గాయాలవ్వడం. ఇప్పుడా ఓటమికి ప్రతీకారంగా ఆదివారం జరిగిన మ్యాచ్​లో టీమ్ ఇండియా విజృంభించింది. అది కూడా హార్దిక్​ రూపంలో. దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగేలా ప్రత్యర్థి జట్టుపై చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడతడు. ఓడిన చోటే గెలుపును సొంతం చేసుకున్నాడు. మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు.

hardik pandya
hardik pandya

Hardik pandya on his victory in india pak match: ఆసియా కప్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. గత టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి భారత్‌ బదులు తీర్చుకుని తాజా ఆసియా కప్​లో బోణీ కొట్టింది. ఈ విజయంలో ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య(33, 3 వికెట్లు) కీలక పాత్ర పోషించాడు. తన సత్తా ఎలాంటిదో.. తన సామర్థ్యానికి అతడు పూర్తిగా న్యాయం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ మ్యాచ్‌ రుజువు. నిఖార్సయిన ఆల్‌రౌండర్‌ అన్న మాటకు నిర్వచనం చెప్పాడు.

జట్టులో పునరాగమనం తర్వాత అతడి సత్తాకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిందీ మ్యాచ్​. కేరీర్ ముగిసిపోయిందనుకున్న దశ నుంచి జట్టును ఒంటిచేత్తో విజయ తీరాలకు చేర్చిన ఘనతను హార్దిక్ సొంతం చేసుకున్నాడు. భుజానికి శస్త్ర చికిత్స తర్వాత ఇక బౌలింగ్ చేయలేడనుకున్న అంచనాలను తలకిందులు చేశాడు. తన విల్ పవర్ ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు.

స్ట్రెచర్‌పై..అయితే 2018లో ఇదే ఆసియా కప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టుపై మ్యాచ్ ఆడుతూ గాయపడి స్ట్రెచర్‌పై గ్రౌండ్‌ను వీడాడు హార్దిక్. అప్పుడు 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్ 5వ బంతిని సంధించిన తర్వాత కాలు జారి కింద పడ్డాడు. నడవలేని స్థితిలో అతన్ని స్ట్రెచర్‌పై తీసుకెళ్లాల్సి వచ్చింది. మిగిలిన ఆ ఒక్క బంతిని అంబటి రాయుడు వేశాడు. వెన్నునొప్పితో చాలాకాలం పాటు బాధపడ్డాడు. 2021 ఆసియా కప్‌లోనూ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. అయిదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓవర్లు మాత్రమే వేశాడు.
కానీ ఇప్పుడు అదే హార్దిక్ పాండ్యా.. ఈ ఆసియా కప్‌లో విధ్వంసాన్ని సృష్టించాడు. తొలుత బంతితో ఆ తర్వాత బ్యాట్‌తో చెలరేగిపోయి తనకు తిరుగులేదని మళ్లీ నిరూపించుకున్నాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను చెల్లాచెదురు చేసి, చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ​మొదట పాక్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు (4) తీసింది భువనేశ్వరే కానీ.. భారత బౌలర్లలో హీరో మాత్రం హార్దిక్‌ పాండ్యనే. మ్యాచ్‌ను మలుపు తిప్పే బౌలింగ్‌ ప్రదర్శన అతడిదే. రిజ్వాన్‌, ఇఫ్తికార్‌ల మధ్య భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న సమయంలో.. ఇఫ్తికార్‌ను ఔట్‌ చేసి భారత్‌కు అతను ఉపశమనాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఒకే ఓవర్లో రిజ్వాన్‌, ఖుష్‌దిల్‌ షాల వికెట్లు పడగొట్టి పాక్‌ పెద్ద స్కోరు చేయకుండా అడ్డు పడ్డాడు. పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్‌ను హార్దిక్‌ చాలా బాగా ఉపయోగించుకున్నాడు. షార్ట్‌ పిచ్‌ అస్త్రాన్ని అతను బాగా వాడుకుని పాక్‌ను దెబ్బ తీశాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో 25 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ హార్దిక్‌ విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. గెలిపించేలా కనిపించిన సూర్యకుమార్‌ ఔటైపోయి, సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోతున్న సమయంలో క్రీజులో అడుగు పెట్టిన అతను.. తీవ్ర ఒత్తిడిలో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖర్లో అతను సిక్సర్‌తో మ్యాచ్‌ గెలిపించాడు. మొత్తంగా 17 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Last Updated : Aug 29, 2022, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details