తెలంగాణ

telangana

'ధోనీ ధాటిగా ఆడలేదు.. అక్కడే చెన్నై ఆగిపోయింది'

By

Published : Apr 4, 2022, 3:33 PM IST

Sunil Gavaskar on MS Dhoni: చెన్నైకి అవసరమైన సమయంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ దూకుడు చూపలేకపోయాడని అన్నాడు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. ఓ వైపు యువ ఆటగాడు శివమ్ దూబె ధాటిగా పోరాడుతున్న వేళ.. అతడికి సహకారం కొరవడిందని పేర్కొన్నాడు. ఆదివారం పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 54 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది చెన్నై. ఈ నేపథ్యంలోనే గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

sunil gavaskar on ms dhoni
csk vs pbks

Sunil Gavaskar on MS Dhoni: చెన్నై స్టార్‌ బ్యాటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (23; 28 బంతుల్లో 1x4, 1x6) ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో అవసరమైన వేళ ధాటిగా ఆడలేకపోయాడని బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్ గావస్కర్‌ అన్నాడు. ఒకవైపు శివమ్‌ దూబె (57; 30 బంతుల్లో 6x4, 3x6) దంచికొడుతుంటే మరోవైపు ధోనీ.. ఒకటి, రెండు పరుగులు తీస్తూ స్ట్రైక్‌ రొటేట్‌ చేశాడన్నాడు. ఇటీవలే ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన గావస్కర్‌.. మహీ బ్యాటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్‌లో వరుసగా మూడో మ్యాచ్‌ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

దూబె, ధోనీ

"ధోనీని ఈ మ్యాచ్‌లో చూస్తే పెద్ద షాట్లు ఆడకపోయినా సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ స్ట్రైక్‌ రొటేట్‌ చేశాడు. అతడు ఇంతకుముందులా ఈ మ్యాచ్‌లో ధాటిగా ఆడలేకపోయాడు. దాంతో చెన్నై అక్కడే ఆగిపోయినట్లు అనిపించింది. దూబె దూకుడుగా ఆడుతూ బాగా పరుగులు సాధిస్తున్న సమయంలో అతడికి అండగా ఉండాల్సింది. అది జరగలేదు. ఎప్పుడైనా ఓవర్‌కు 20 పరుగులు చేయాల్సిన స్థితిలో అత్యుత్తమ ఆటగాళ్లకు కూడా కష్టమే. అదంత తేలికేం కాదు. వరుసగా మూడు ఓటములతో కొత్త కెప్టెన్‌ రవీంద్ర జడేజాపై ఇప్పుడు తీవ్ర ఒత్తిడి ఉంటుంది. జడేజాకు ధోనీ అండగా ఉన్నా ఇప్పటికీ చెన్నై ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోవడం కెప్టెన్‌కు ఇబ్బందే. వీలైనంత త్వరగా ఆ జట్టును విజయాల బాట పట్టించాలి. ఇంకా 11 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. గతేడాది కోల్‌కతా ఇలాగే సగం సీజన్‌ తర్వాత మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్‌కు చేరింది" అని గావస్కర్‌ గుర్తుచేశాడు. కాగా, చెన్నై తర్వాతి మ్యాచ్‌లో శనివారం హైదరాబాద్‌తో ఆడనుంది. దీంతో ఆ మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details