ఐపీఎల్ మ్యాచ్లకు స్టేడియాల్లో ప్రేక్షకుల లేరన్న భావనే కలగట్లేదని అభిప్రాయపడ్డాడు సన్రైజర్స్ హైదరాబాద్ మార్గనిర్దేశకుడు వీవీఎస్ లక్ష్మణ్. టీవీలో మాదిరే స్టేడియాల్లో అరుపులు, కేరింతల కోసం కృత్రిమ ఏర్పాట్లు చేశారని లక్ష్మణ్ తెలిపాడు. దిల్లీ క్యాపిటల్స్పై విజయంతో సన్రైజర్స్ జట్టులో ఆత్మవిశ్వాసం వచ్చిందన్న లక్ష్మణ్ గురువారం కొంతమంది మీడియా ప్రతినిధులతో వర్చువల్గా మాట్లాడాడు.
కరోనా భయంలేదు
అంతా జాగ్రత్తగా ఉంటున్నాం. అయితే కరోనా భయం లేదు. ఎప్పట్లాగే అయిదు రోజులకోసారి కరోనా పరీక్షలు చేస్తున్నారు. దుబాయ్ నుంచి అబుదాబికి వెళ్లేటప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. బయో బబుల్ నుంచి ఎవరినీ బయటకు వెళ్లనీయట్లేదు. బయటి వాళ్లను లోపలికి రానివ్వట్లేదు. ప్రస్తుతానికి ఎవరికీ ఎలాంటి భయాలు లేవు. ఇప్పుడు అందరూ ఆటలో నిమగ్నమయ్యారు.
ఇక్కడా కేరింతల హోరు
ప్రేక్షకుల అరుపులు, కేకలు టీవీ వీక్షకులకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రసారదారు మైదానంలోని ఆటగాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫోర్ లేదా సిక్సర్ కొట్టినప్పుడు.. వికెట్ తీసినప్పుడు ప్రేక్షకులు ఆటగాడి పేరును అరుస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ కేకలు, ఈలలు వినిపిస్తుండటం వల్ల స్టేడియంలో ప్రేక్షకులు లేరన్న భావనే ఆటగాళ్లకు కలగట్లేదు.
పరుగులు తగ్గొచ్చు..
ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యుత్తమ లీగ్. ప్రమాణాలు.. నాణ్యత పరంగా అత్యున్నతమైనది. ఇప్పటి వరకు నరాలు తెగే ఉత్కంఠభరిత పోరాటాలతో ఐపీఎల్ ఎప్పుడూ లేనంతగా అలరిస్తోంది. భారీస్కోర్లు నమోదవుతున్నాయి. ఆటగాళ్లు సెంచరీలతో హోరెత్తిస్తున్నారు. సిక్సర్లకు కొదవలేదు. ఆఖరి బంతికి ఫలితాలు వస్తున్నాయి. మ్యాచ్లు సూపర్ ఓవర్లకూ వెళ్తున్నాయి. అయితే టోర్నీ సాగేకొద్దీ వికెట్లు నెమ్మదిస్తాయి. దుబాయ్, అబుదాబిలో స్కోర్లు తగ్గొచ్చు. చిన్న మైదానం, ఫ్లాట్ వికెట్ కావడం వల్ల షార్జాలో భారీస్కోర్లు నమోదవుతూనే ఉంటాయి.
మిడిల్ ఆందోళన లేదు
సన్రైజర్స్ మిడిలార్డర్ బలహీనంగా ఉందంటూ కొందరు మాట్లాటడం సరికాదు. మిడిలార్డర్పై మాకెలాంటి ఆందోళన లేదు. అసలు ఇప్పటిదాకా మిడిలార్డర్కు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ప్రతి జట్టు మాదిరే సన్రైజర్స్లోనూ యువ ఆటగాళ్లు ఉన్నారు. ప్రియం గార్గ్, అభిషేక్శర్మ, అబ్దుల్ సమద్ మిడిలార్డర్లో ఆడుతున్నారు. బ్యాటింగ్ లైనప్పై మాకు నమ్మకముంది. వార్నర్, బెయిర్స్టో, విలియమ్సన్, రషీద్ ఖాన్లు తుదిజట్టులో ఉండటం వల్ల మిగితా విదేశీ ఆటగాళ్లు నబి, ఫాబీ అలెన్లు ఎదురుచూడాల్సి వస్తోంది. ఉత్తమ బౌలింగ్ వనరులు ఉండటం సన్రైజర్స్కు సానుకూలాంశం.
రాయుడు నాణ్యమైన ఆటగాడు
చెన్నైతో తర్వాతి మ్యాచ్లో అత్యుత్తమ కూర్పుతో బరిలో దిగుతాం. అన్ని జట్లకు వ్యూహాలు ఉంటాయి. ఆచరణలో పెట్టడమే కీలకం. దిల్లీని ఓడించినట్లే చెన్నైని కట్టడి చేస్తాం. అంబటి రాయుడు నాణ్యమైన ఆటగాడు. తొలి మ్యాచ్లో అతడి ప్రదర్శన చూశాం. రాయుడుతో పాటు వాట్సన్ నుంచి ధోని వరకు ప్రతి ఒక్క బ్యాట్స్మన్ను కట్టడి చేసేందుకు మా దగ్గర వ్యూహాలు ఉన్నాయి.
అక్టోబరు 2(శుక్రవారం) చెన్నై సూపర్కింగ్స్తో అమీతుమీ తేల్చుకోనుంది సన్రైజర్స్.
ఇదీ చూడండిఐపీఎల్: చెన్నైXహైదరాబాద్..గెలుపు ఎవరిది!