మెల్బోర్న్లో జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ 'రనౌట్' నుంచి తప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. పైన్ ఔట్ అయ్యాడని మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. సామాజిక మాధ్యమాల్లో ఆ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్గా మారింది. అందులో 'ఏదో తేడాగా ఉంది(సమ్థింగ్ ఫిషీ మ్యాన్)' అని ఎవరో టీమ్ఇండియా ఆటగాడు అనడం వినిపించింది. అయితే.. ఆ గొంతు ఎవరిదై ఉంటుందని అందరూ చర్చించుకుంటున్నారు.
"ఓవర్ పూర్తికాగానే.. స్టంప్స్ వెనక నుంచి సమ్థింగ్ ఫిషీ మ్యాన్ అన్నారెవరో."- నెటిజన్
"హహహ.. స్టంప్ మైక్స్ చాలా బాగున్నాయి. టీమ్ఇండియా ఆటగాడు ఎవరో 'సమ్థింగ్ ఫిషీ మ్యాన్' అన్నారు. ఆ గొంతు పంత్దే అనుకుంటున్నా."-నెటిజన్
పైన్ ఔటేనన్నది షేన్ వార్న్ సహా చాలా మంది మాజీల అభిప్రాయం. పైన్ 6 (16 బంతుల్లో) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు జరిగిందీ సంఘటన. కామెరూన్ గ్రీన్ సమన్వయ లోపం కారణంగా పైన్ దాదాపు రనౌటైనంత పనైంది. ఉమేశ్ యాదవ్ కవర్స్ నుంచి త్రో వేయగా.. పంత్ స్టంప్స్ గిరాటేశాడు. దీంతో అంపైర్.. మూడో అంపైర్కు నివేదించాడు. కానీ పైన్.. బ్యాటు లైన్పై ఉందా లేదా లోపల ఉందా అన్నది రిప్లేలో తేల్చడం కూడా కష్టమైంది. దీంతో అంపైర్ పాల్ విల్సన్ చివరికి దానిని నాటౌట్గా ప్రకటించాడు.
ఇదీ చూడండి:ఆసీస్ కెప్టెన్ పైన్ 'రనౌట్'పై రచ్చ రచ్చ!