తెలంగాణ

telangana

By

Published : Nov 29, 2021, 9:41 PM IST

Updated : Nov 29, 2021, 10:59 PM IST

ETV Bharat / sports

మరోసారి ద్రవిడ్​ క్రీడాస్ఫూర్తి.. తటస్థ పిచ్​ కోసం పట్టుబట్టి మరీ!

కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ అభిమానులకు ఎంతో మజానిచ్చింది. అయితే ఈ మ్యాచ్​ ఇలా చివరి వరకు సాగడానికి కారణం టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అని మీకు తెలుసా?

rahul Dravid latest news, Dravid gives Rs 35000 to groundsmen , ద్రవిడ్ సాయం, ద్రవిడ్ లేటెస్ట్ న్యూస్
Dravid

టీమ్ఇండియా కొత్త కోచ్‌ రాహుల్ ద్రవిడ్ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు. కాన్పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ కోసం పిచ్‌ను ప్రత్యేకంగా తయారు చేయించాడు. టెస్టు క్రికెట్లో మామూలుగా ఆతిథ్యమిస్తున్న జట్టుకు అనుకూలించేలా పిచ్‌ను తయారు చేస్తుంటారు. అయితే, ద్రవిడ్‌ అందుకు భిన్నంగా ఇరుజట్లకు పిచ్‌ అనుకూలించేలా తయారు చేయించి ప్రత్యేకత చాటుకున్నాడు. ఇందుకోసం శివకుమార్‌ నేతృత్వంలోని గ్రీన్‌ పార్క్‌ మైదాన సిబ్బందికి రూ. 35 వేలు అందించడం గమనార్హం. మ్యాచ్‌ ముగిసిన అనంతరం.. ఉత్తర్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (యూపీసీఏ) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఇటీవలి కాలంలో ఎక్కువగా మూడు నాలుగు రోజుల్లోనే టెస్టు మ్యాచులు ముగిసిపోతున్నాయి. సొంత జట్టుకు అనుకూలంగా పిచ్‌ను తయారు చేయించి విజయం సాధించడంలో మజా లేదని భావించిన ద్రవిడ్‌.. ఇలా తటస్థంగా తయారు చేయించాడని విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పిచ్‌పై శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌, టామ్ లాథమ్‌, విల్‌ యంగ్‌ వంటి బ్యాటర్లు నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. అలాగే, టిమ్ సౌథీ, కైల్‌ జేమీసన్‌ వంటి విదేశీ బౌలర్లు కూడా మెరుగ్గా రాణించారు.

భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు చివరి సెషన్‌లో గొప్పగా పుంజుకున్న భారత బౌలర్లు.. ఐదు వికెట్లు పడగొట్టారు. అయితే, కివీస్‌ టెయిలెండర్లు అజాజ్‌ పటేల్ (2), రచిన్‌ రవీంద్ర (18) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో టీమ్‌ఇండియా విజయానికి ఒక్క వికెట్ దూరంలో నిలిచిపోయింది.

ఇవీ చూడండి: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానం ఎంతంటే?

Last Updated : Nov 29, 2021, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details