తెలంగాణ

telangana

By

Published : Jul 17, 2019, 5:46 AM IST

ETV Bharat / sports

'బౌండరీ నిబంధన కంటే.. మరో సూపర్​ ఓవర్​ బెటర్​'

ప్రపంచకప్​ ఫైనల్లో న్యూజిలాండ్​పై ఊహించని విధంగా విజయం సాధించింది ఇంగ్లాండ్​. ​తొలుత ఇరుజట్ల స్కోర్లు సమమైన తర్వాత సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై అయిన విషయం తెలిసిందే. మ్యాచ్​లో ఇంగ్లండ్ అత్యధిక బౌండ‌రీలు కొట్టిందనే కారణంతో ఆ​ జట్టును విజేతగా ప్రకటించింది ఐసీసీ. ఈ వివాదాస్ప‌ద నిర్ణయాన్ని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్​ అభిమానులు, మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు సచిన్ తెందూల్కర్​​ ఐసీసీ నిబంధనపై వేరేలా స్పందించాడు.

'బౌండరీల కన్నా మరో సూపర్​ ఓవర్​ బెటర్​'

ఐసీసీ వరల్డ్​కప్-2019 ఫైనల్​ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ను విజేతగా ప్రకటించేందుకు ఎంచుకున్న నిబంధనపై మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్​ విమర్శలు గుప్పించాడు. బౌండరీలతో విజేతను నిర్ణయించడం కన్నా మరో సూపర్​ ఓవర్​ పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

సచిన్​ తెందూల్కర్​

" ప్రపంచకప్​ ఫైనల్​లో స్కోర్లు సమమైన తర్వాత సూపర్​ ఓవర్​ రావడం ఇప్పటివరకు జరగలేదు. అప్పడు కూడా టై అవడం కాస్త విచిత్రమే. కానీ.. అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు బౌండరీల ద్వారా కాకుండా మరో సూపర్​ ఓవర్ ద్వారా గెలుపును నిర్ణయిస్తే బాగుండేది. ఫుట్​బాల్​లో ఇలాంటి నియమమే పాటిస్తారు. ఇరుజట్లకూ మరింత సమయం ఇచ్చి విజేతను నిర్ణయిస్తారు ".

-- సచిన్​ తెందూల్కర్​, భారత లెజండరీ క్రికెటర్​

ఈ బౌండరీ నిబంధనను ఐసీసీ మార్చాలని.. భారత స్టార్​ బ్యాట్స్​మెన్​ రోహిత్​ శర్మ, మాజీ క్రికెటర్లు గౌతమ్​ గంభీర్​, యువరాజ్​ సింగ్​, ఆస్ట్రేలియా మాజీ బౌలర్​ షేన్ వార్న్ సూచించారు.

లార్డ్స్​లో జులై 14న జరిగిన ఫైనల్​లో ఇంగ్లాండ్​ 26 బౌండరీలు సాధించగా.. న్యూజిలాండ్​ 17 మాత్రమే చేసింది. ఫలితంగా కివీస్​ జట్టు ఓటమి పాలవగా.. ఇంగ్లీష్​ జట్టు ట్రోఫీని ముద్దాడింది.

ప్లే ఆఫ్స్​కే ఓటు...

టోర్నీ ఆద్యంతం బాగా ఆడి పాయింట్ల పట్టికలో టాప్​లో నిలిచిన భారత్​ ఒకే మ్యాచ్​లో సరైన ప్రదర్శన చేయకపోవడం వల్ల సెమీస్​లో ఇంటిముఖం పట్టింది. దీనిపైనా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ ఈ విధానాన్ని వ్యతిరేకించాడు. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్) తరహాలో ప్లే ఆఫ్స్​ ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలోనూ కోహ్లీకి మద్దతు పలికాడు సచిన్​ తెందూల్కర్​. ఐపీఎల్​ ప్లే ఆఫ్స్​ విధానంలో టాప్​ రెండు జట్లకు ఒక మ్యాచ్​ ఓడిపోయినా మరో మ్యాచ్​ ఆడే అవకాశం లభిస్తుంది.

విరాట్​ కోహ్లీ

ధోనీ స్థానం కీలకం...

సెమీఫైనల్లో టీమిండియా టాప్​ ఆర్డర్​ కుప్పకూలి కష్టాల్లో ఉన్న సమయంలో ధోనీని 5వ స్థానంలో పంపితే బాగుడేందని అభిప్రాయపడ్డాడు సచిన్​. హార్దిక్​ పాండ్య 6వ స్థానంలోనూ, కార్తీక్​ 7వ స్థానంలోనూ వస్తే ఫలితం వేరేలా ఉండేదని మాట్లాడాడు. వికెట్లు పడి కష్టాల్లో ఉన్నప్పుడు ధోనీని బ్యాటింగ్​కు పంపితే భారత్​కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవని వెల్లడించాడు తెందూల్కర్​.

ABOUT THE AUTHOR

...view details