తెలంగాణ

telangana

కోహ్లీ, సింధుకు ట్విట్టర్​ అభిమానుల నీరాజనం

By

Published : Dec 14, 2019, 6:34 AM IST

భారత్​లో ఈ ఏడాది అత్యంత ఆదరణ పొందిన క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది ట్విట్టర్​ ఇండియా. పురుషుల విభాగంలో టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. మహిళల్లో బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీ సింధు టాప్​లో నిలిచింది.

twitter india sports rankings: kohli and sindhu tops
కోహ్లీ, సింధుకు ట్విట్టర్​ అభిమానుల నీరాజనం!

ట్విట్టర్​...సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు ప్రస్తుతమున్న అద్భుత వేదిక. అభిమానులు, ప్రజలకు చేరువగా ఉండేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి అలాంటి సామాజిక మాధ్యమం ద్వారా ఎవరెవరు ఎంత ఆదరణ పొందారు అనేది తాజాగా వెల్లడించింది ట్విట్టర్​ ఇండియా.

అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారుల ట్విట్టర్‌ హ్యాండిల్స్‌కు ర్యాంకింగ్స్​ ఇచ్చింది. ఇప్పటికే క్రికెట్​లో ఎందరో దిగ్గజాల రికార్డులు ఛేదించేందుకు పోటీ పడుతున్న కోహ్లీ.. అభిమానుల మద్దతులోనూ టాప్​ లేపాడు. పురుష ఆటగాళ్లలో విరాట్​ కింగ్​గా నిలిచాడు. మహిళల్లో నం.1గా తెలుగుతేజం, స్టార్​ షట్లర్​ పీవీ సింధు నిలిచింది. అత్యధిక ట్వీట్లు చేయడం, రీట్వీట్ కావడం, మోస్ట్ లైకులు ఇలా పలు అంశాలను బేరీజు వేసి ర్యాంకులను ప్రకటించింది ట్విట్టర్​ ఇండియా. మహిళల తొలి పది స్థానాల్లో వివిధ క్రీడలకు సంబంధించిన వారు ఉన్నా... పురుషుల్లో టాప్​-10 మాత్రం క్రికెటర్లే కావడం విశేషం.

1.విరాట్​ కోహ్లీ...

విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్​తో తొలిస్థానాన్ని దక్కించుకున్నాడు కోహ్లీ. ప్రస్తుతం ఉన్న అన్ని జట్ల కెప్టెన్లలో ఇతడే ఎక్కువ సమయం అభిమానులకు కేటాయిస్తాడట. ట్విట్టర్​లో 32.6 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు విరాట్​. ఇతడు అనుష్క శర్మ, మహేంద్ర సింగ్​ ధోనీ పుట్టినరోజున చేసిన పోస్టులు విపరీతంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. రీట్వీట్లలో మహీపై చేసిన పోస్టు ఈ ఏడాది రికార్డు సృష్టించింది.

ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో 60 శాతం సగటుతో పరుగులు చేశాడు విరాట్​. అంతర్జాతీయ క్రికెట్​లో ఈ ఏడాది 2366 రన్స్​ సాధించాడు.

2. మహేంద్ర సింగ్​ ధోనీ...

టీమిండియా మాజీ సారథి ధోనీ రిటైర్మెంటు ఈ ఏడాది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచకప్​లో భారతజట్టు సెమీస్​లో ఓడిపోయాక ఇతడు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్​ ఆడలేదు. వచ్చే ఏడాది ఐపీఎల్​లో బరిలోకి దిగుతాడని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది పెద్దగా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​లో ఉండకపోయినా.. అభిమానులు అతడి పేరును ఎక్కువగా ప్రస్తావించడం వల్ల రెండో స్థానంలో నిలిచాడు.

3. రోహిత్​శర్మ

ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు రోహిత్​శర్మ. టెస్టుల్లోనూ ఓపెనర్​గా అరంగేట్రం చేశాడు. ఐదు టెస్టుల్లో 556 రన్స్​ చేశాడు. ఇందులో మూడు శతకాలున్నాయి. అన్ని ఫార్మాట్లలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్​లో 648 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఇతడికి ఇప్పటికే 15 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

4. సచిన్​ తెందూల్కర్​

మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ ఆటకు వీడ్కోలు పలికి దాదాపు ఆరేళ్లు అవుతోంది. అయితే ఆ తర్వాత నుంచి ట్విట్టర్లో యాక్టివ్​గా ఉంటున్నాడు. ప్రస్తుతం 31 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. చాలా మంది క్రికెటర్ల పుట్టినరోజులు, సామాజిక అంశాలపై ఎక్కువగా ట్వీట్లు చేస్తుంటాడు.

5. వీరేంద్ర సెహ్వాగ్​

మైదానంలో ఎంత దూకుడుగాబ్యాటింగ్ చేస్తాడో.. సామాజిక మాధ్యమాల్లోనూ అంతే వేగంగా సమాధానాలు ఇస్తుంటాడు. ఎటువంటి అంశంపై అయినా నిర్మొహమాటంగా, నిర్భయంగా తన భావాన్ని వ్యక్తపరచగలడు. అంతేకాకుండా ఫన్నీ సందర్భాలను అభిమానులతో పంచుకుంటాడు. తోటి ఆటగాళ్ల పుట్టినరోజులను, క్రీడా సంబంధిత విషయాలపై ఎక్కువగా మాట్లాడతాడు. 2015లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్​ ప్రకటించాడీ భారత విధ్వంసకర ఓపెనర్​​. అప్పుడప్పుడు కామెంటేటర్​గానూ దర్శనమిస్తుంటాడు.

6. హర్భజన్​ సింగ్​

ఆరో స్థానంలో హర్భజన్​ సింగ్​ చోటు దక్కించుకున్నాడు. 10.3 మిలియన్ల ఫాలోవర్లతో నిలిచాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్​ తరఫున ఆడుతున్నాడు. ఇతడు చేసిన కొన్ని తమిళ ట్వీట్లు బాగా వైరల్​ అయ్యాయి.

7.యువరాజ్​

ఈ ఏడాది జూన్​లో ఆటకు గుడ్​బై చెప్పేశాడు యువీ. ప్రస్తుతం విదేశాల్లోని పలు టీ20 లీగ్​ల్లో సందడి చేస్తున్నాడు. ఈ క్రికెటర్​ కూడా సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్​గా ఉంటాడు. మైదానంలోనే కాకుండా కేన్స​ర్​ను జయించిన ఆటగాడు. ఇతడు క్యాన్సర్​పై అవగాహన కల్పించేలా పోస్టులు పెడుతుంటాడు.

భారత జట్టు ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య 8వ స్థానంలో నిలిచాడు. ఇతడు కేఎల్​ రాహుల్​తో కలిసి ఓ చాట్​షోలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

9వ స్థానంలో రవీంద్ర జడేజా నిలిచాడు. ప్రపంచకప్​ సెమీస్​లో ధోనీతో కలిసి వీరోచిత ఇన్నింగ్స్​ ఆడాడు. అద్భుతమైన క్యాచ్​లు, ఆల్​రౌండర్​ ప్రదర్శనతో చాలా సార్లు ఆకట్టుకున్నాడు. వ్యాఖ్యాత సంజయ్​ మంజ్రేకర్​ ఇతడిపై చేసిన వ్యాఖ్యలకు అప్పట్లో నెటిజన్లు విపరీతంగా స్పందించారు.

10వ స్థానంలో జస్ప్రీత్​ బుమ్రా నిలిచాడు. ప్రపంచకప్​లో టీమిండియా సెమీస్​ వరకు ఓటమి లేకుండా దూసుకెళ్లడంలో ఇతడు కీలక పాత్ర పోషించాడు. ఇతడికి టాలీవుడ్​ నటి అనుపమ మధ్య ప్రేమ పుకార్లు బాగా చక్కర్లు కొట్టాయి.

టాప్​-10 పురుష క్రీడాకారుల జాబితా

మహిళల్లో టాప్​ తెలుగమ్మాయిదే...

మహిళల కేటగిరీలో తెలుగు షట్లర్, భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి పీవీ సింధు అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది వరల్డ్ చాంపియన్‌గా నిలిచాక సింధు పేరు మారుమోగిపోయింది. ఫలితంగా సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ ఏడాది టాప్ స్థానం దక్కించుకుంది.

రెండో స్థానంలో సంచలన యువ అథ్లెట్ హిమ దాస్ నిలిచింది. ఇటీవల పలు టోర్నీల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి చర్చనీయాశంగా మారింది. సానియా మీర్జా (టెన్నిస్), మరో స్టార్​ షట్లర్​ సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్), మిథాలీ రాజ్(క్రికెట్), మేరీ కోమ్ (బాక్సింగ్), స్మృతి మందణ్న (క్రికెట్), ద్యుతి చంద్(అథ్లెటిక్స్), మానసి నయన జోషి(పారా బ్యాడ్మింటన్), రాణి రాంపాల్ (హాకీ) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇందులో నలుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లు కావడం విశేషం.

టాప్​-10 మహిళా క్రీడాకారిణుల జాబితా

ABOUT THE AUTHOR

...view details