మొతేరాలో మూడో టెస్టులో స్పిన్నర్ల బంతులు ఆడలేక రెండు జట్ల బ్యాట్స్మెన్ అల్లాడిపోవడం, మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిపోవడం వల్ల ఇంగ్లిష్ జట్టు మద్దతుదారులు ఎంతగా రెచ్చిపోయారో తెలిసిందే. కానీ ఆ మ్యాచ్లో ఇరు జట్లకూ పిచ్ సమానం. పైగా టాస్ గెలిచింది ఇంగ్లాండ్. తొలి రోజు బ్యాటింగ్కు కొంత అనుకూలంగా ఉన్న పిచ్ మీద మొదట బ్యాటింగ్ చేసింది ఆ జట్టే. అయినా మ్యాచ్ను భారత్ సొంతం చేసుకుంది. చివరి టెస్టుకు అనుకున్నట్లే పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తూనే బ్యాటింగ్కూ సహకరించేలా తయారైంది. పైగా ఇది డేనైట్ టెస్టు కాదు. ఈ మ్యాచ్లోనూ మొదట టాస్ ఇంగ్లాండే గెలిచింది. మొదట బ్యాటింగే చేసింది. కానీ 200 పైచిలుకు స్కోరుతో సరిపెట్టుకుంది.
ఇప్పుడేమంటారు మద్దతుదారులు?
రెండో రోజు భారత్ బ్యాటింగ్లో ఎంత ఇబ్బంది పడిందో అందరూ చూశారు. కానీ 146 పరుగులకే 6 వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్.. ఆ తర్వాత ఒత్తిడి కొనసాగించలేకపోయింది. పట్టుదలతో నిలిస్తే పిచ్ ఎలా ఉన్నా పరుగులు సాధించొచ్చని పంత్, సుందర్ చాటి చెప్పారు. ఆ ఇన్నింగ్స్లు పూర్తిగా వారి ఘనత. అవి ఇంగ్లాండ్ వైఫల్యానికి సూచికలు కూడా. మూడో రోజు ఉదయం సుందర్, అక్షర్ ఎంత సాధికారితతో ఆడారో అందరూ చూశారు. రెండో సెషన్లో అదే పిచ్ మీద ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ తేలిపోయారు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన సుందర్, అక్షర్ కలిపి చేసిన పరుగులు కూడా ఆ జట్టు మొత్తం కలిసి చేయలేకపోయింది. ఇక పిచ్ను ఏమని నిందిస్తారు ఇంగ్లాండ్ మద్దతుదారులు.
ఇక సాకులేవీ?