ఐపీఎల్.. క్రికెటర్లు తమ సత్తా నిరూపించుకోవడానికి ప్రపంచంలోనే చక్కని వేదిక. ఈ లీగ్లో అద్భుత ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నవారు కూడా ఉన్నారు. అందుకే ఇందులో పాల్గొనాలని ఒక్క అవకాశం కోసం ఎంతోమంది ఆటగాళ్లు ఎదురుచూస్తుంటారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఎట్టకేలకు దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి మెగాటోర్నీకి రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా ఐపీఎల్ అరంగేట్రం చేయనున్న టాప్ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.
యశస్వి జైస్వాల్
యశస్వి జైస్వాల్.. అండర్-19 ప్రపంచకప్లో ఆరు మ్యాచుల్లో 400 పరుగులు చేసి వెలుగులోకి వచ్చాడు. ఫీల్డింగ్, బ్యాటింగ్లో అద్భుతంగా రాణించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ వేలంపాటలో రూ.2.4కోట్లకు ఇతడిని కొనుగోలు చేసింది.
రుతురాజ్ గైక్వాడ్
రుతురాజ్ గైక్వాడ్.. ప్రస్తుతం కరోనా సోకడం వల్ల కొన్ని మ్యాచులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇటీవల సీఎస్కేలో రైనా వైదొలగడం వల్ల.. అతడి స్థానంలో ఇతడు ఆడే అవకాశం ఉంది. లిస్ట్-ఏ క్రికెట్లో 54 మ్యాచుల్లోనే 2499 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 187. ఈసారి వేలంలో చెన్నై జట్టు యాజమాన్యం రూ.20లక్షలకు కొనుగోలు చేసింది.
రవి బిష్ణోయ్
రవి బిష్ణోయ్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఈ ఏడాది ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ రాణించగల సామర్థ్యం చూసి యాజమాన్యం ఇతడిని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.