ఐపీఎల్ ట్రేడింగ్ విండో ముగియడం వల్ల అన్ని జట్లు తమకు అవసరమైన ఆటగాళ్లను అట్టిపెట్టుకొని మిగిలిన వారిని విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో చాలాసార్లు విధ్వంసకర ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందించిన క్రిస్లిన్ను... కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) జట్టు విడిచిపెట్టింది. ఈ నిర్ణయం తప్పని యువీ అభిప్రాయపడ్డాడు.
" అతడిని నేనెన్నో సార్లు ఐపీఎల్లో చూశాను. కేకేఆర్కు క్రిస్లిన్ చాలాసార్లు మెరుపు ఆరంభాలు అందించాడు. వారెందుకు అతడిని అట్టిపెట్టుకోలేదో అర్థంకాలేదు. ఈ నిర్ణయం తప్పని అనుకుంటున్నాను. షారుఖ్ ఖాన్ను కచ్చితంగా ఓ మెసేజ్ పంపిస్తాను".
-యువరాజ్ సింగ్
యువీ మాటలకు స్పందించింది నైట్రైడర్స్ యాజమాన్యం. ఆ జట్టు సీఈవో వెంకీ మైసూర్ చమత్కారంగా సమాధానం ఇచ్చాడు.
"యువీ... నీ కోసం బిడ్ వేసేందుకే మేం క్రిస్లిన్ను విడుదల చేశాం. మీరిద్దరూ ఛాంపియన్లు. ఇద్దరిపై ప్రేమ, గౌరవం ఉంటుంది" అని వెంకీ ట్వీట్ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పుడే ఐపీఎల్ ఆడటం లేదని యువరాజ్ స్పష్టం చేశాడు. ఆ తర్వాత నుంచి విదేశీ లీగ్ల్లోనే బరిలోకి దిగుతున్నాడు. కెనడా టీ20 తర్వాత అబుదాబిలో జరుగుతున్న టీ10 లీగ్తో పాటు, త్వరలో ప్రారంభం కానున్న 'ద హండ్రెండ్' టోర్నీలో యువీ ఆడనున్నాడు. అయితే సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ వంటి ఫ్రాంచైజీలు అతడి ఐపీఎల్ పునరాగమనంపై పరోక్షంగా స్పందిస్తుండటం వల్ల.. ఈ సిక్సర్ల వీరుడు తన నిర్ణయం మార్చుకుంటాడేమో చూడాలి.