చెన్నైలోని చెపాక్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ మంచి ప్రదర్శన చేసింది. ఆరంభంలో కాస్త తడబడినా.. యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, పంత్ అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.
ఆరంభంలోఆదుకున్నరోహిత్..
టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(4), కేఎల్ రాహుల్(6) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. విండీస్ బౌలర్ షెల్డాన్ కాట్రెల్ వీరిద్దరిని ఔట్ చేసి భారత్కు షాకిచ్చాడు. మరో ఓపెనర్ రోహిత్ నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ను నడిపించాడు. 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు హిట్మ్యాన్.
అయ్యర్ క్లాస్ ఇన్నింగ్స్..
నాలుగో స్థానంలో ఎప్పటినుంచో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీమిండియాకు.. సరైన బ్యాట్స్మన్గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. ఈ మ్యాచ్లో 70 పరుగులు(88 బంతుల్లో; 7ఫోర్లు, 1 సిక్సర్) సాధించి భారత జట్టును గాడిన పెట్టాడు. 80 పరుగులకే మూడు వికెట్లు పడిన టీమిండియా ఇన్నింగ్స్ను చక్కదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు.
ధోనీ ఫేవరెట్ మైదానంలోనే...
టీమిండియా మాజీ సారథి, కీపర్ ధోనీ.. ఫేవరెట్ మైదానంలో పంత్ సత్తా చాటాడు. చాలారోజులుగా సరైన ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొన్న ఈ యువ క్రికెటర్... ఎట్టకేలకు కెరీర్లో తొలి అర్ధశతకం నమోదు చేశాడు. 71 పరుగులు(69 బంతుల్లో; 7 ఫోర్లు, 1 సిక్సర్) సాధించాడు పంత్. టాపార్డర్ బ్యాట్స్మెన్లకే సాధ్యంకాని రీతిలో 102.9 స్టయిక్ రేటుతో పరుగులు సాధించాడు.
చక్కటి ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్న పంత్.. అచ్చిరాని షాట్తోనే ఔటయ్యాడు. ఎక్కువగా డీప్ బ్యాక్వర్డ్ స్వ్కేర్ లెగ్, డీప్ పాయింట్ల్లో ఔటయ్యే పంత్ మళ్లీ అదే తప్పు చేశాడు. బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లోకి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి వికెట్ కోల్పోయాడు. పొలార్డ్ వేసిన 40 ఓవర్ మూడో బంతిని కవర్స్ మీదుగా ఫోర్కు పంపిన పంత్.. ఆ ఓవర్ మరుసటి బంతిని స్వేర్ లెగ్ మీదుగా భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
వివాదాస్పదంగా జడేజా రనౌట్...
దాదాపు 114 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన శ్రేయస్-పంత్ జోడీ... వెంట వెంటనే ఔటయ్యారు. శ్రేయస్ ఔటైన 16 పరుగుల తర్వాత పంత్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాదవ్(40), జడేజా(21) ఆఖర్లో ఇన్నింగ్స్ను నడిపించారు. అయితే జడేజా రనౌట్ వివాదాస్పదంగా మారింది. రనౌట్పై ఆన్ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ను సంప్రదించడంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వీరిద్దరి తర్వాత దూబే బ్యాటింగ్కు వచ్చాడు. వన్డేల్లో అరంగేట్ర మ్యాచ్ ఆడిన దూబే... 9 రన్స్ చేశాడు.
కాట్రెల్ వణికించాడు...
ఆరంభ ఓవర్లే మెయిడెన్లుగా నమోదు చేసిన విండీస్ పేసర్ కాట్రెల్.. మ్యాచ్లో కీలక వికెట్లు తీశాడు. పరుగులను బాగా నియంత్రించాడు. ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన కాట్రెల్... రాహుల్, కోహ్లీను ఔట్ చేశాడు.
కరీబియన్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, కీమో పాల్ రెండేసి వికెట్లు తీయగా, కీరన్ పొలార్డ్ ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.