తెలంగాణ

telangana

ముష్ఫికర్ అర్ధసెంచరీ.. పోరాడుతున్న బంగ్లా

By

Published : Nov 23, 2019, 8:58 PM IST

కోల్‌కతా వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో బంగ్లాదేశ్ పోరాడుతోంది​. తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైన బంగ్లా జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. సీనియర్​ బ్యాట్స్​మన్​ ముష్ఫికర్​ రహీమ్​ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

బంగ్లాను నిలబెట్టిన ముష్ఫికర్​... మూడోరోజుకు ఆట

ఈడెన్​ గార్డెన్ వేదికగా భారత్​-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లా జట్టు 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు షాద్​మన్​ ఇస్లామ్​.. ఇషాంత్​ బౌలింగ్​లో డకౌట్​ అయ్యాడు. రెండు ఇన్నింగ్స్​ల్లోనూ తొలి వికెట్​ ఇషాంత్​ శర్మకే దక్కడం విశేషం. ఆ తర్వాత మెహినుల్​ హక్ తర్వాతి ఓవర్​లో డకౌట్​గా ఇషాంత్​ బౌలింగ్​లోనే ఔటయ్యాడు. అనంతరం మహ్మద్‌ మిథున్‌(6) ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్​లో పెవిలియన్ చేరాడు. స్వల్ప వ్యవధిలో ఇమ్రుల్‌ కైస్‌(5)ను ఇషాంత్‌ ఔట్‌ చేయడం వల్ల బంగ్లాదేశ్‌ 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో భారత బౌలర్ల జోరుకు కేవలం రెండు రోజుల్లోనే ఆట ముగుస్తుందని అంతా అనుకున్నారు.

అప్పుడు క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్​ రహీమ్​, మహ్మదుల్లా(39)తో కలిసి ఇన్నింగ్స్​ను​ చక్కదిద్దాడు. అయితే మధ్యలో కండరాల నొప్పితో రిటైర్డ్​హర్ట్​గా వెనుదిరిగాడు మహ్మదుల్లా. ఆ తర్వాత మెహిది హసన్​(15), తైజుల్​ ఇస్లాం(11) తక్కువకే ఔటయ్యారు. మరో ఎండ్​లో ఉన్న ముష్ఫికర్​ (59 బ్యాటింగ్‌; 70 బంతుల్లో, 12 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించి అజేయంగా క్రీజులో నిలిచాడు. అద్భుతమైన ఇన్నింగ్స్​తో టెస్టు కెరీర్​లో 21వ అర్ధశతకం నమోదు చేసుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌ ఐదు వికెట్లతో చెలరేగగా... రెండో ఇన్నింగ్స్​లోనూ నాలుగు వికెట్లతో రాణించాడు. ఆఖరి సెషన్​లో బంగ్లా ఆటగాళ్లు బాగా ఆడటం వల్ల వికెట్​ కోసం శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో రెండో టెస్టులోతొలిసారిబౌలింగ్​ వేశాడు అశ్విన్​. ఉమేశ్​ రెండు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్​ ముగిసే సమయానికి 32.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది బంగ్లా. ఇంకా 89 పరుగుల వెనుకంజలో ఉంది.

గులాబి మైదానంలో భారతీయుడు..

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 174/3తో శనివారం రెండో రోజు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(51; 69 బంతుల్లో 7ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క్రమంలో రహానె అర్ధ శతకం పూర్తి చేశాక తైజుల్‌ ఇస్లామ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 62వ ఓవర్‌ తొలి బంతికే ఇబాదత్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(136; 194 బంతుల్లో, 18 ఫోర్లు).. కెరీర్​లో మరో శతకం సాధించాడు. టెస్టుల్లో 27 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 347/9 వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా భారత్‌కు 241 పరుగుల ఆధిక్యం లభించింది.

విరాట్​ శతకం

ABOUT THE AUTHOR

...view details