అసలే టీ20 క్రికెట్.. ఆపై ప్రపంచకప్! ఈ తరం క్రికెట్ అభిమానుల ఉత్సాహానికి కొదవేముంటుంది? అయితే పురుషుల క్రికెట్లో పొట్టి ప్రపంచకప్ సంబరాల కోసం ఇంకా ఎనిమిది నెలలు ఎదురు చూడాలి. కానీ అంతకంటే ముందే ధనాధన్ ఇన్నింగ్స్లు అందించడానికి అమ్మాయిలు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియా వేదికగా నేటి నుంచే ఈ క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది.
ఈరోజు ఆరంభ మ్యాచ్లో టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. తొలి వరల్డ్కప్ అందుకోవాలని భారత్... మరోకప్పు ఖాతాలో వేసుకోవాలని ఆస్ట్రేలియా ఆరాటపడుతున్నాయి. 17 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీలో 10 జట్లు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా పలు విశేషాలివే...
- పురుషుల తొలి టీ20 ప్రపంచకప్ (2007) జరిగిన రెండేళ్లకు.. మహిళల టీ20 వరల్డ్కప్ను ఆరంభించింది ఐసీసీ. 2009లో జరిగిన తొలి టోర్నీలో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది.
- ఈ ఏడాది చివర్లో పురుషుల టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యమివ్వనున్న ఆస్ట్రేలియానే.. మహిళల టోర్నీనీ నిర్వహిస్తోంది. పది జట్లు పోటీ పడే ఈ టోర్నీ.. ఫిబ్రవరి 21న మొదలై మార్చి 8న ముగుస్తుంది. మెగా ఈవెంట్లో మొత్తం 23 మ్యాచ్లు జరుగుతాయి.
- ఆస్ట్రేలియా ఆతిథ్య జట్టు మాత్రమే కాదు.. అత్యంత విజయవంతమైన జట్టు. డిఫెండింగ్ ఛాంపియన్ కావడం, మంచి ఫామ్లో ఉండటం.. తాజాగా భారత్, ఇంగ్లాండ్లతో జరిగిన ముక్కోణపు సిరీస్లోనూ విజేతగా నిలవడం వల్ల టైటిల్కు హాట్ ఫేవరెట్గా కంగారూ జట్టును భావిస్తున్నారు.
- ఫిబ్రవరి 21న ప్రపంచకప్ తొలి మ్యాచ్లో భారత్.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. ఆరంభ మ్యాచ్కు సిడ్నీ ఆతిథ్యమివ్వనుండగా.. మార్చి 8న మెల్బోర్న్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
- రెండేళ్ల క్రితం కప్పు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోని 15 మందిలో... 13 మంది ప్రస్తుత టోర్నీలోనూ బరిలోకి దిగుతున్నారు.
ఫార్మాట్ ఇలా..
టోర్నీలో పోటీ పడుతున్న పది జట్లలో అయిదేసి జట్లను ఎ, బి గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ దశ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో సాగుతుంది. గ్రూప్లో ప్రతి జట్టూ మిగతా నాలుగు జట్లలో ఒక్కో లీగ్ మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి.
తొలిసారి మిథాలీ లేకుండా..
టీ20 ప్రపంచకప్లో తొలిసారి భారత జట్టు దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ లేకుండా బరిలోకి దిగుతోంది. 2009లో తొలి ప్రపంచకప్ నుంచి వరుసగా ఆరు టోర్నీల్లోనూ ఆమె బరిలోకి దిగింది. అయితే గత కప్పులో సెమీఫైనల్కు మిథాలీని తుది జట్టులోకి తీసుకోకపోవడం దుమారం రేపింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో మిథాలీ ఉంటే భారత్ గెలిచేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గత ఏడాది ఆమె టీ20లకు గుడ్బై చెప్పింది. గత టోర్నీలో సారథిగా వ్యవహరించిన హర్మన్ప్రీతే ఈసారి కూడా జట్టును నడిపించనుంది.
>> ఈసారి టోర్నీలో ఆడనున్న థాయిలాండ్కు ఇదే తొలి టీ20 ప్రపంచకప్.