తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టార్​ క్రీడాకారులకు కరోనా సోకడానికి కారణమదేనా?

క్రీడారంగంపై కరోనా పగబట్టినట్లే ఉంది. వైరస్‌ ముప్పు పొంచి ఉన్నప్పటికీ.. ధైర్యంగా ఆటలు పునఃప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న వివిధ క్రీడల నిర్వాహకులకు కరోనా షాకుల మీద షాకులిస్తోంది. ఇటు టెన్నిస్‌, అటు క్రికెట్లో కరోనా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు జకోవిచ్‌ వైరస్‌ బారిన పడడం కలకలం సృష్టిస్తోంది. జకో ఆధ్వర్యంలోనే నిర్వహించిన ఎగ్జిబిషన్‌ టోర్నీ ద్వారా అతడితో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు పాజిటివ్‌గా తేలడం టెన్నిస్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. మరోవైపు పాకిస్థాన్‌ జాతీయ క్రికెట్‌ జట్టులో ఏకంగా పదిమంది కరోనా బాధితులుగా తేలారు. సోమవారం వైరస్‌ సోకిన ముగ్గురికి.. తర్వాతి రోజు ఇంకో ఏడుగురు తోడయ్యారు. దీంతో టెన్నిస్‌, క్రికెట్‌ మాత్రమే కాక.. ఇతర క్రీడల్లోనూ ఈవెంట్ల నిర్వహణపై పునరాలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది.

By

Published : Jun 24, 2020, 7:33 AM IST

sports
క్రీడాకారులు

టెన్నిస్‌లో కరోనా కలవరం కొనసాగుతోంది. సెర్బియా టెన్నిస్‌ దిగ్గజ ఆటగాడు జకోవిచ్‌కు పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే దిమిత్రోవ్‌ (బల్గేరియా), కొరిచ్‌ (క్రొయేషియా) ఆ మహమ్మారి చేతికి చిక్కగా.. తాజాగా మంగళవారం జకోవిచ్‌తో పాటు విక్టర్‌ ట్రయోకీ (సెర్బియా)కి వైరస్‌ సోకినట్లు తేలింది. జకో భార్య జెలీనా, గర్భవతైన విక్టర్‌ భార్య కూడా వైరస్‌ బాధితులుగా మారారు.

‘‘నాకు, నా భార్యకు పాజిటివ్‌ వచ్చింది. నా పిల్లలకు నెగెటివ్‌గా తేలింది. ఆగ్నేయ ఐరోపాలోని ఆటగాళ్లను పోటీతో కూడిన టెన్నిస్‌ ఆడేలా చేయడంతో పాటు వచ్చిన విరాళాలను అవసరాల్లో ఉన్నవాళ్లకు అందించడం కోసమే టోర్నీ నిర్వహించాం. వైరస్‌ బలహీనపడిందని నమ్మి పోటీలు జరిపాం. కానీ దురదృష్టవశాత్తూ ఆ వైరస్‌ ఉనికి అలాగే ఉంది. దానితో కలిసి జీవించడం ఎలా అనే విషయాన్ని ఇంకా నేర్చుకుంటూనే ఉన్నామనే వాస్తవం బోధపడింది. వైరస్‌ సోకిన వాళ్లను క్షమాపణలు కోరుతున్నా’’ అని జకో ఓ ప్రకటనలో తెలిపాడు. మరోవైపు ఇద్దరు కోచ్‌లు కూడా వైరస్‌ బారిన పడ్డట్లు సమాచారం.

అసలేం జరిగింది..?

వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో సెర్బియాతో సహా చుట్టు పక్కల దేశాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు దాదాపుగా ఎత్తివేయడంతో క్రీడా టోర్నీల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఆడ్రియా టూర్‌ ఎగ్జిబిషన్‌ ఛారిటీ టోర్నీ నిర్వహణకు జకోవిచ్‌ సిద్ధమయ్యాడు. తొలి అంచె పోటీలు ఈ నెల 13, 14వ తేదీల్లో సెర్బియాలో జరిగాయి. రెండో అంచె పోటీలు క్రొయేషియాలో గత శనివారం మొదలయ్యాయి. అయితే ఆ టూర్‌లో పాల్గొన్న దిమిత్రోవ్‌ కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల రెండో అంచె పోటీలను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. టోర్నీలో ఆడిన ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వైరస్‌ బారిన పడుతుండడంతో వచ్చే 27, 28 తేదీల్లో మాంటెనిగ్రోలో జరగాల్సిన మూడో అంచె పోటీలను కూడా రద్దు చేశారు. ఈ టోర్నీల్లో పాల్గొన్న స్టార్‌ ఆటగాళ్లు జ్వెరెవ్‌, సిలిచ్‌, రుబ్లెవ్‌లకు నెగెటివ్‌ రావడం కాస్త ఉమశమనం కలిగించే విషయం.

విందులు.. వినోదాలు

ఆంక్షలు ఎత్తివేయడంతో కరోనా సంగతి మరిచిపోయిన జకోవిచ్‌.. వైరస్‌కు ముందు రోజుల్లోలాగా టోర్నీని నిర్వహించాడు. ఈ మ్యాచ్‌లకు స్టేడియాలు పూర్తి స్థాయిలో అభిమానులతో నిండిపోయాయి. ఏ ఒక్కరూ భౌతిక దూరం అనే విషయాన్నే పట్టించుకోలేదు. చాలా మంది మాస్కులు ధరించలేదు. మైదానాల్లో ఎప్పట్లా కరచాలనాలు.. హైఫైలు.. కౌగిలింతలు.. అన్నీ కనిపించాయి. అంతటితో ఆగకుండా మ్యాచ్‌ల అనంతరం ఆటగాళ్లు వినోదాల్లో మునిగిపోయారు. అందరూ కలిసి ఒకరినొకరు తాకుతూ బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌ ఆడారు. నైట్‌ క్లబ్బుకు వెళ్లి నృత్యాలు చేస్తూ సరదాగా గడిపారు. అభిమానులు, బాల్‌ బాయ్స్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. దీంతో వైరస్‌ విజృంభించింది. ఈ నేపథ్యంలో అసలేమాత్రం జాగ్రత్తలు పాటించకుండా టోర్నీని నిర్వహించడం ద్వారా వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యాడంటూ జకోవిచ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జకోవిచ్​

"టెన్నిస్‌ ఆటగాళ్లు వైరస్‌ బారిన పడడం ఆందోళనగా ఉంది. ఎలాంటి నిబంధనలు పాటించకుండా టోర్నీని నిర్వహించిన జకోవిచ్‌ పూర్తి బాధ్యత వహించాలి" అని బ్రిటన్‌ ఆటగాడు డాన్‌ ఇవాన్స్‌ తెలిపాడు. "ఎగ్జిబిషన్‌ టోర్నీ నిర్వహణ అనాలోచిత నిర్ణయం. వైరస్‌ బారిన పడిన ఆటగాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. భౌతిక దూరం నిబంధనలు పాటించకపోతే ఇలాగే జరుగుతుంది. ఇది జోక్‌ కాదు" అని ఆస్ట్రేలియా స్టార్‌ నిక్‌ కిర్గియోస్‌ పేర్కొన్నాడు.

పాక్​ ఆటగాళ్లపై పంజా

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుపై వైరస్‌ పంజా విప్పింది. ఇంగ్లాండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులోని ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తంగా పది మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. ఇప్పటికే హైదర్‌ అలీ, హారిస్‌, షాదాబ్‌లకు వైరస్‌ సోకగా.. తాజాగా మరో ఏడుగురు దాని బారిన పడ్డట్లు పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మంగళవారం ప్రకటించింది.

సీనియర్‌ ఆటగాళ్లు మహ్మద్‌ హఫీజ్‌, వాహబ్‌ రియాజ్‌లతో పాటు ఖాసిఫ్‌ భట్టి, మహ్మద్‌ హస్నైన్‌, ఫఖర్‌ జమాన్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ బుధవారం పాజిటివ్‌గా తేలారు.

క్రాడాకారులు

"పది మంది క్రికెటర్లు కరోనా బారిన పడడం మంచి విషయం కాదు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండే ఓ ఆటగాడికే వైరస్‌ సోకినప్పుడు ఇక సాధారణ ప్రజల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది ఎవరికైనా వ్యాపిస్తుంది. క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందిలో ఒకరికి వైరస్‌ సోకింది. ఆటగాళ్లకు గురువారం లాహోర్‌లో మరోసారి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తాం. ఆ తర్వాతి రోజు తిరిగి జట్టును మళ్లీ ప్రకటిస్తాం. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో జరిగే సిరీస్‌ కోసం జట్టు ఆదివారం బయల్దేరాల్సి ఉంది. ప్రస్తుతం మేం భయపడట్లేదు. ఎందుకంటే మా చేతిలో ఇంకా సమయం ఉంది. ఇంగ్లాండ్‌ చేరిన తర్వాత కూడా ఆటగాళ్లకు, సిబ్బందికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు" అని పీసీబీ సీఈఓ వసీమ్‌ ఖాన్‌ తెలిపాడు.

ఒకేసారి పది మంది పాక్‌ ఆటగాళ్లు వైరస్‌ బారిన పడిన నేపథ్యంలో ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ పర్యటన సందేహంగా మారింది. మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ కోసం ఈ నెల 28న పాక్‌ జట్టు ఇంగ్లాండ్‌కు బయల్దేరాల్సి ఉంది. అక్కడికెళ్లాక ఆటగాళ్లు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. వచ్చే నెల చివర్లో సిరీస్‌ ఆరంభమయ్యే అవకాశముంది. సిరీస్‌ డేట్లు ఖరారవ్వలేదు. ఇంకా ఎంతమంది పాజిటివ్‌గా తేలతారో తెలియదు, మరో అయిదు రోజుల్లో జట్టు ఇంగ్లాండ్‌కు బయల్దేరాలి. ఈలోపు కొత్తగా పది మంది ప్రత్యామ్నాయ ఆటగాళ్లను పాక్‌ జట్టులోకి ఎంపిక చేసి పర్యటనకు పంపుతారా అన్నది సందేహం. అయితే పాక్‌ ఆటగాళ్లు ఎంత మందికి కరోనా సోకినా సరే.. ఈ సిరీస్‌ మాత్రం నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నామని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఉన్నతాధికారి గైల్స్‌ క్లార్క్‌ పేర్కొనడం గమనార్హం.

కివీస్‌-బంగ్లా సిరీస్‌ వాయిదా

బంగ్లాదేశ్‌ పర్యటనను న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు వాయిదా వేసుకుంది. ఇటీవల ముగ్గురు బంగ్లా క్రికెటర్లకు కరోనా సోకడమే దానికి కారణం. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు- సెప్టెంబర్‌ మధ్యలో కివీస్‌ జట్టు బంగ్లాదేశ్‌లో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

ఇది చూడండి : 'కోహ్లీ క్రీజులో నిలిస్తే అతని వేగాన్ని ఆపడం కష్టం'

ABOUT THE AUTHOR

...view details