పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయించే రోజుల్లో టీమ్ఇండియా ఆటగాళ్లు తమపై దయ చూపమని అడిగేవారని షాహిద్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలకు మాజీ బ్యాట్స్మన్ ఆకాశ్చోప్రా గట్టి కౌంటర్ ఇచ్చాడు. భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన అన్ని మ్యాచ్ల గణాంకాలు బయటకు తీసి అతడు చేసిన ఆరోపణలను ఖండించాడు. అఫ్రిదీ ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పాడన్నాడు. ఆకాశ్చోప్రా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ పాక్ మాజీ సారథిపై మండిపడ్డాడు.
"పాము కాటుకు చికిత్స ఉంది కానీ, దురభిప్రాయం కలిగిన వాడికి ఎలాంటి చికిత్స లేదని కొందరు మేధావులు చెప్పారు. అఫ్రిదీ ఆడే రోజుల్లో ఇరు జట్లూ సమానంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఆ సమయంలో భారతే కాస్త ఆధిపత్యం చెలాయించే స్థితిలో ఉండేది. అలాగే ప్రపంచకప్ల చరిత్ర చూసినా భారత్ ఎంతో మెరుగైన స్థాయిలో ఉంది. అయితే, వాళ్లెప్పుడూ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్నే గుర్తు చేసుకుంటారు. కానీ, అదే టోర్నీలో భారత్ కూడా ఆ జట్టును ఓడించింది. టీమ్ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు కంగారూ జట్టును ఓడించింది. పాకిస్థాన్ అదే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు ఓటమిపాలైంది. ఇప్పుడున్న స్థితిలో రెండు జట్ల మధ్య ఎంతో సారూప్యత నెలకొంది."