తెలంగాణ

telangana

By

Published : Jan 7, 2021, 6:50 AM IST

ETV Bharat / sports

బ్యాడ్మింటన్ సందడి షురూ.. షట్లర్లు సిద్ధం

2020 మార్చి 22.. దేశంలో ఆటలు నిలిచిపోయిన రోజు. కరోనా మహమ్మారి తీవ్రత పెరగడం.. లాక్‌డౌన్‌.. తదనంతర ఆంక్షల కారణంగా అంతర్జాతీయ టోర్నీలన్నీ ఆగిపోయాయి. సుదీర్ఘ విరామం అనంతరం బయో బబుల్‌ వాతావరణంలో క్రికెట్‌, ఫుట్‌బాల్‌, టెన్నిస్‌ లాంటి ఆటల్లో కదలిక వచ్చింది. ఇప్పుడు బ్యాడ్మింటన్‌ వంతొచ్చింది. త్వరలోనే పూర్తిస్థాయి టోర్నీలతో బ్యాడ్మింటన్‌ మళ్లీ పట్టాలెక్కనుంది.

indian badminton players are ready for the battles
ఇక బ్యాడ్మింటన్ సందడి.. సిద్ధంగా షట్లర్లు

గతేడాది మార్చిలో ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్‌ పూర్తిగా నిలిచిపోయింది. బీడబ్ల్యూఎఫ్‌ క్యాలెండర్‌లోని టోర్నీలు రద్దయ్యాయి.. వాయిదా పడ్డాయి. దాదాపు 10 నెలల తర్వాత పూర్తిస్థాయి టోర్నీకి రంగం సిద్ధమైంది. ఈనెల 12 నుంచి 17 వరకు బ్యాంకాక్‌లో జరిగే యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌తో బ్యాడ్మింటన్‌ కోర్టుల్లో సందడి మొదలవనుంది. ప్రపంచ ఛాంపియన్‌ పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ సహ భారత స్టార్‌ క్రీడాకారులంతా తమ రాకెట్‌ విన్యాసాలతో మళ్లీ అభిమానులను అలరించబోతున్నారు.

ఈ నెలలో జరిగే యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌, టొయొటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ (19- 24)లతో అంతర్జాతీయ క్రీడాకారులంతా మళ్లీ బరిలో దిగనున్నారు. అక్టోబరులో డెన్మార్క్‌ ఓపెన్‌ జరిగినా.. సింధు, సైనా సహ అగ్రశ్రేణి క్రీడాకారులు దూరంగా ఉన్నారు. భారత్‌ నుంచి కిదాంబి శ్రీకాంత్‌ పాల్గొన్నా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. స్టార్‌ క్రీడాకారులు దూరంగా ఉండటం వల్ల బీడబ్ల్యూఎఫ్‌ సైతం టోర్నీల నిర్వహణకు మొగ్గుచూపలేదు. అయితే టోక్యో ఒలింపిక్స్‌ సమీపిస్తుండటం వల్ల క్వాలిఫయింగ్‌, ర్యాంకింగ్‌పై దృష్టిసారించింది. ఒకేసారి క్వాలిఫయింగ్‌ టోర్నీలు పెట్టుకుండా మొదట థాయ్‌లాండ్‌ టోర్నీలు నిర్వహిస్తోంది. నెల తర్వాత క్వాలిఫయింగ్‌ పోటీలు ప్రారంభిస్తుంది. క్రీడాకారులు తమ ఫిట్‌నెస్‌, నైపుణ్యంపై అంచనాకు రావడానికి రెండు టోర్నీలు.. విరామ సమయం దోహద పడతాయన్నది బీడబ్ల్యూఎఫ్‌ ఆలోచన.

బ్యాడ్మింటన్​ క్రీడాకారులు

సాధన.. ఎవరెలా?:2020 మార్చి 22న దేశంలో ఆటలు నిలిచిపోగా.. ఆగస్టు 7న ఆంక్షల నడుమ పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో స్టార్‌ క్రీడాకారులకు శిక్షణ మళ్లీ ప్రారంభమైంది. మొదట్లో కరోనా కలకలం రేపినా తర్వాత అంతా సర్దుకుంది. సింధు, సాయిప్రణీత్‌, శ్రీకాంత్‌, సిక్కిరెడ్డి, సుమీత్‌రెడ్డిలు పూర్తిస్థాయిలో శిక్షణలో నిమగ్నమయ్యారు. సైనా, కశ్యప్‌, అశ్విని విడిగా శిక్షణ కొనసాగించారు. చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ ఆధ్వర్యంలో క్రీడాకారుల శిక్షణ, ట్రెయినింగ్‌ జోరుగా సాగుతోంది. న్యూట్రిషన్‌, ఇతర శిక్షణ కోసం సింధు గత అక్టోబరులో లండన్‌ వెళ్లింది. అక్కడి నుంచే టోర్నీలకు వెళ్లింది

"ఇంగ్లాండ్‌కు రావడం సరైన నిర్ణయం. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కఠినంగా సాధన చేశా. మాజీ ఆటగాడు రాజీవ్‌ ఊసెఫ్‌ మార్గనిర్దేశనంలో ఆటకు మెరుగులు దిద్దుకుంటున్నా. సుదీర్ఘ విరామం తర్వాత వెంటనే లయను దొరకబుచ్చుకోవడం కష్టం. కానీ నా వరకు బాగానే పుంజుకున్నా. సత్తాచాటగలనన్న నమ్మకంతో ఉన్నా. కొన్ని నెలల్లోనే ఒలింపిక్స్‌ ఉన్నాయి. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ విజయంతో 2021 ప్రారంభించాలని అనుకుంటున్నా."

- సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

ఇక సైనా, సాయిప్రణీత్‌, కశ్యప్‌, ప్రణయ్‌ల పూర్తిస్థాయి శిక్షణకు కరోనాతో బ్రేకులు పడ్డాయి. నవంబరు 25న గురుసాయిదత్‌ వివాహానికి హాజరైన కశ్యప్‌, సాయిప్రణీత్‌, ప్రణయ్‌ పాజిటివ్‌గా తేలారు. సైనాకు నెగటివ్‌ వచ్చినా ఆమె కూడా క్వారంటైన్‌లో ఉండాల్సొచ్చింది. 20 రోజుల తర్వాత ఇటీవల వీరంతా శిక్షణ మొదలుపెట్టారు.డబుల్స్‌ క్రీడాకారులు సాత్విక్‌ సాయిరాజు, చిరాగ్‌ శెట్టి, సుమీత్‌రెడ్డి, మను అత్రి, సిక్కిరెడ్డి, అశ్వినిలు ఆగస్టు నుంచి పూర్తిస్థాయి శిక్షణ కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి:భారత బ్యాడ్మింటన్ జట్టు థాయ్​లాండ్​కు పయనం

ABOUT THE AUTHOR

...view details