గతేడాది 'మహర్షి'తో ప్రేక్షకులను పలకరించిన మహేశ్బాబు ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'మహర్షి'లతో వరుస సందేశాత్మక సినిమాలు చేస్తూ సాగుతున్న మహేశ్ నుంచి 'పోకిరి', 'దూకుడు' తర్వాత మాస్ మసాలా ఎంటర్టైనర్ను చూసి ప్రేక్షకులకు చాలా కాలమైంది. అలాంటి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ రూపంలో ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. అంతేకాదు, 13 ఏళ్ల తర్వాత విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం, అదీ మహేశ్బాబుతో కలిసి పనిచేయడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఆర్మీ అధికారిగా మహేశ్ ఎలా నటించారు? ప్రొఫెసర్ భారతి పాత్రలో విజయశాంతి పాత్ర ఎలా చేశారు? అనిల్ రావిపూడి మహేశ్ను ఎలా చూపించారు? మహేశ్ నుంచి పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ను కోరుకుంటున్న అభిమానుల ఆశ నెరవేరిందా?
కథేంటంటే:
అజయ్ కృష్ణ (మహేశ్బాబు) ఆర్మీలో మేజర్. ధైర్య సాహసాలు కలిగిన ఆర్మీ అధికారి. కొందరు ఉగ్రవాదులు పాఠశాల విద్యార్థులను కిడ్నాప్ చేస్తారు. వారి చెర నుంచి విద్యార్థులను విడిపించేందుకు ప్రత్యేక ఆపరేషన్ కోసం రంగంలోకి దిగుతారు మహేశ్బాబు, అతని టీమ్. ఆ సమయంలో మేజర్ అజయ్ కృష్ణకు ఒక ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. దీంతో ఆర్మీ నిబంధనలకు కట్టుబడి కర్నూలు బయలుదేరి వస్తాడు. అక్కడ భారతి (విజయశాంతి) కర్నూలు మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్. కశ్మీర్లో ఆర్మీ మేజర్గా పనిచేసే అజయ్కృష్ణ.. వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతిని వెతుక్కుంటూ కర్నూలుకు ఎందుకు రావాల్సి వచ్చింది? అజయ్ కర్నూలు వచ్చేసరికి భారతి ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు? ఆ పరిస్థితులకు కారణం ఎవరు? ఆమెను ఆ ఆపద నుంచి అజయ్ ఎలా రక్షించాడు? అసలు ప్రొఫెసర్ భారతికి అజయ్కృష్ణకు ఉన్న సంబంధం ఏంటి? మంత్రి నాగేంద్రప్రసాద్ (ప్రకాష్రాజ్) కథేంటి? చివరకు అతను ఏమయ్యాడు? మధ్యలో సంస్కృతి (రష్మిక) ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే
ఎలా ఉందంటే:
మహేశ్బాబు నుంచి ఒక మాస్ ఎంటర్టైనర్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల ఆశ ‘సరిలేరు నీకెవ్వరు’తో ఎట్టకేలకు నెరవేరింది. సగటు మహేశ్ అభిమాని ఏం కోరుకుంటాడో అవన్నీ రంగరించి తయారు చేసుకున్న కథలా అనిపిస్తుంది. ఆర్మీ అధికారిగా మహేశ్ లుక్, యాక్షన్ ఆయన అభిమానులను విశేషంగా అలరిస్తుంది. అదే సమయంలో ప్రొఫెసర్ భారతిని కాపాడే వ్యక్తిగా రెండు పాత్రల్లో వేరియేషన్స్ చూపించాడు. ఆర్మీ నేపథ్యంతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఉగ్రవాదుల నుంచి మహేశ్బాబు విద్యార్థులను కాపాడే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. అనుకోని పరిస్థితుల్లో అజయ్ రైలులో కర్నూలు బయలుదేరతాడు. అప్పటివరకూ సీరియస్గా సాగిన కథలోకి రష్మిక, సంగీత, రావు రమేష్, బండ్ల గణేశ్ తదితర పాత్రలు ప్రవేశిస్తాయి. ఆ పాత్రలన్నీ అలరిస్తాయి. రైలులో జరిగే సన్నివేశాలన్నీ ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్విస్తాయి. అజయ్ను ప్రేమించే అమ్మాయిగా రష్మిక నటన, మేనరిజం.. బ్లేడ్ గ్యాంగ్గా బండ్ల గణేష్ హంగామాతో ప్రథమార్ధం కితకితలు పెట్టిస్తుంది. ఆ తర్వాత కథ కర్నూలు చేరుకోవడంతో కథలోకి మళ్లీ సీరియస్నెస్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి అజయ్, భారతి-నాగేంద్రకుమార్ల మధ్య పోరు మొదలవుతుంది.
నవ్వులు పూయించింది..
ద్వితీయార్ధం మొత్తం అజయ్-భారతి-నాగేంద్ర ప్రసాద్ ఈ మూడు పాత్రల మధ్యే ప్రధానంగా సన్నివేశాలు సాగుతాయి. ఒక హత్య కేసు కోసం భారతి పోరాటం చేయడం, ఆ ఆమె కుటుంబంపై నాగేంద్రకుమార్ కక్ష సాధించడం, విషయం తెలిసిన అజయ్ ఆ చర్యలను అడ్డుకోవడం ఇలా సన్నివేశాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మహేశ్-విజయశాంతి-ప్రకాష్రాజ్ ఒకరితో పోటీ పడి మరొకరు నటించారు. ప్రథమార్ధంలో కామెడీకి అధిక ప్రాధాన్యం ఇచ్చిన దర్శకుడు ద్వితీయార్ధంలో కథనం సీరియస్గా నడుపుతూనే, క్రైమ్ బాంచ్ కోటిగా సుబ్బరాజు, కిషోర్లతో కామెడీతో పంచే ప్రయత్నం చేశాడు. ఆ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి.
రాజకీయ నాయకులను బంధించి మహేశ్బాబు చెప్పే పిట్ట కథ, వాళ్లను భయపెట్టడానికి బాంబు పెట్టడం తదితర సన్నివేశాలు సరదాగా ఉంటాయి. ఇక విజయశాంతి-మహేశ్బాబుల మధ్య ఆర్మీ గొప్పదనం గురించి సన్నివేశాలు ఉద్విగ్నతకు గురి చేస్తాయి. ఆ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఒళ్లు గగురుపొడిచేలా చేస్తుంది. ముఖ్యంగా మహేశ్ కర్నూలు వచ్చిన కారణాన్ని చెప్పే సన్నివేశంలో భావోద్వేగాలు అద్భుతంగా పండాయి. ఇంచుమించుగా మూడు గంటల నిడివి ఉన్న సినిమా ఇది. దీంతో ప్రథమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధం కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. అయితే, కథ సీరియస్గా సాగుతూనే మహేశ్ కామెడీ టైమింగ్ అలరిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల సమయంలోనూ మహేశ్ పంచ్లు, ప్రాసలు అభిమానులను ఆకట్టుకుంటాయి. ఇక కృష్ణ వెండితెరపై తళుక్కున మెరుస్తారు. అయితే, ఆయన ఎలా కనిపిస్తారన్నది వెండితెరపై చూడాల్సిందే. ఆయా సన్నివేశాలు అభిమానులకు పండగే. సన్నివేశాలకు ఇంకాస్త కత్తెర వేస్తే బాగుండేదేమో. క్లైమాక్స్ రొటీన్కు భిన్నంగా సాగుతుంది.
ఎవరెలా చేశారంటే..
చాలా రోజుల తర్వాత మహేశ్బాబుకు ఒక పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ చేసే అవకాశం లభించింది. ఆర్మీ అధికారిగా, భారతి కుటుంబాన్ని కాపాడే వ్యక్తిగా రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించారు. మేజర్ అజయ్కృష్ణగా ఉన్నంతసేపు హుందాగా నటించిన ఆయన కర్నూలు బయలుదేరిన తర్వాత నుంచి ఇంకాస్త ఎనర్జిట్గా నటించారు. ‘పోకిరి’, ‘దూకుడు’ తర్వాత ఆ స్థాయి కామెడీ టైమింగ్తో అలరించారు. ముఖ్యంగా మహేశ్ డైలాగ్ డెలివరీ, డ్యాన్స్లు, యాక్షన్ అభిమానులను విశేషంగా అలరిస్తుంది.
లేడీ అమితాబ్ అదరగొట్టేసింది...