తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వారు దర్శకులే కాదు.. మంచి కథకులు కూడా..

రచయితలు కథలు అందిస్తే దర్శకులు సినిమాను తెరకెక్కించడం నిన్నటి తరం. తమ కథలు తామే రాసుకుని సినిమాను రూపొందించడం నేటి దర్శకుల శైలి. ఈ క్రమంలోనే తమ సినిమాలకే కాకుండా వేరే సినిమాలకు కథ, మాటలు అందిస్తూ సత్తా చాటుతున్నారు ఈ డైరెక్టర్స్.​ వారెవరంటే?

By

Published : Dec 2, 2020, 7:00 AM IST

director
దర్శకులు

ఒకప్పుడు రచయితలు కథను అందిస్తే వాటి ఆధారంగా దర్శకులు సినిమాను తెరకెక్కించేవారు. తర్వాత కాలంలో దర్శకులే కథలు, మాటలు రాస్తూ వచ్చారు. ఇప్పటికీ కథలు అందించే వారున్నా సొంతంగా రాసుకుంటున్న దర్శకులే ఎక్కువ. ఇప్పుడు తరం మారింది. కొందరు అగ్ర దర్శకులు పెద్ద హీరోలతో పనిచేస్తూనే వారు చెప్పాలనుకుని, భారీ స్థాయిలో చేయలేని కథలను చిన్న సినిమాలుగా అందిస్తున్నారు. కథలు తాము రాసి.. వేరే యువ దర్శకులకు సినిమా తెరకెక్కించే బాధ్యతను అప్పగిస్తున్నారు. అవసరమైతే స్వయంగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

సుక్కు మార్క్‌ లెక్క

సుకుమార్‌ సినిమాల శైలే వేరుగా ఉంటుంది. అందుకే పరిశ్రమలో సుక్కు లేక్కే వేరు అంటుంటారు. ఆయన కథలు ఓ పజిల్‌లా మనల్ని ఆలోచింపచేసేలా సాగుతుంటాయి. అల్లు అర్జున్‌, మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఇలా అగ్రనటులతో భారీ హంగులతో సినిమాలు తీస్తుంటారు. అలాంటి ఆయన కొన్ని కథలను తమ శిష్యులకు అప్పగించి తెరకెక్కిస్తుంటారు. స్వతంత్ర భావాలున్న ఈ తరం అమ్మాయి కథతో కుమారి 21ఎఫ్‌ను అలాగే అందించారు. దానికి కథ, స్క్రీన్‌ప్లే రాసి, నిర్మాణ బాధ్యతలూ తీసుకున్నారు.. రాజ్‌తరుణ్‌, హెబ్బా పటేల్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సూర్యప్రతాప్‌ తెరకెక్కించారు. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం తోడవడం వల్ల ఆ ఏడాది ఈ చిత్రం విజయాన్ని సాధించింది. అలా సినిమాలు తెరకెక్కించడంలోనే కాదు, సినిమాలు నిర్మించడంలోనూ పర్ఫెక్షనిస్టుని అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం అల్లుఅర్జున్‌తో పుష్ప తెరకెక్కిస్తున్న సుకుమార్‌, తన శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఉప్పెన సినిమా నిర్మాణ బాధ్యతలను మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పంచుకున్నారు. అలాగే కుమారి 21ఎఫ్‌ దర్శకుడు సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్న 18పేజెస్‌ను నిర్మిస్తున్నారు. నిఖిల్‌, అనుపమపరమేశ్వరన్‌ నాయక, నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సుకుమారే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ చిత్రం వేగంగా షూటింగ్‌ జరుపుకొంటోంది.

సుకుమార్​

త్రివిక్రమ్‌... కథా ప్రపంచం

అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌ తొలుత మంచి కథకుడు. స్వయంవరం, నువ్వునాకు నచ్చావ్‌, జైచిరంజీవ చిత్రాలకు కథ, మాటలు అందించి తన కలం బలం ఏమిటో తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు. లోతైన భావాలతో, ఆకట్టుకునే ప్రాసలతో అలరించే త్రివిక్రమ్‌ తర్వాత కాలంలో దర్శకుడిగా మారారు. అగ్ర కథానాయకులతో చిత్రాలు చేస్తూనే అప్పుడప్పుడు కొన్ని సినిమాలకు కథలు, మాటలు అందిస్తుంటారు. తన స్నేహితుడు సునీల్‌ హీరోగా నటించిన అందాలరాముడుకు కథ, మాటలు రాశారు. అలాగే పవన్‌కల్యాణ్‌ తీన్మార్‌ చిత్రానికి మాటలు అందించారు. నితిన్‌ హీరోగా నటించిన చల్‌ మోహన్‌రంగా చిత్రానికి కథ త్రివిక్రమే. ఈ సినిమాకు దర్శకుడు కృష్ణ చైతన్య.

త్రివిక్రమ్​

మాటలు పూరిస్తూ...

పదునైన మాటలతో కథానాయకుల పాత్రలను తీర్చిదిద్దే పూరి జగన్నాథ్‌ తొలినుంచి ఈ మార్గంలో నడుస్తున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా తన సోదరుడు సాయిరామ్‌ శంకర్‌ కథానాయకుడిగా తెరకెక్కిన బంపర్‌ ఆఫర్‌ చిత్రానికి కథ అందించారు. ఇది ప్రేక్షకులను మెప్పించింది. రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పూరినే నిర్మించారు. ఆ తర్వాత రోమియో, రొమాంటిక్‌ చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు.

పూరీ జగన్నాథ్​

సంపత్‌ నంది.. మూడో ప్రయత్నం

పక్కా కమర్షియల్‌ సినిమాలతో విజయాలు అందుకున్న యువ దర్శకుడు సంపత్‌నంది. రామ్‌చరణ్‌తో రచ్చ, రవితేజతో బెంగాల్‌ టైగర్‌లతో అలరించారు. గోపిచంద్‌తో ఆయన తీసిన గౌతమ్‌నంద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈయన రెండు సినిమాలను నిర్మించారు. ఒకటి గాలిపటం కాగా, మరోటి పేపర్‌ బాయ్‌. ఇందులో గాలిపటం సినిమాకు ఆయన కథ, స్క్రీన్‌ప్లే అందించారు. నవీన్‌ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నటించారు. పేపర్‌ బాయ్‌ సినిమాకు కూడా కథ, స్క్రీన్‌ప్లే అందించి కెప్టెన్‌ బాధ్యతలను జయశంకర్‌కు అందించారు. ప్రస్తుతం సంపత్‌నంది బ్లాక్‌రోజ్‌ అనే చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఊర్వసి రౌటేలా నటిస్తున్న ఈ ద్విభాషాచిత్రానికి దర్శకుడు మోహన్‌భరద్వాజ్‌.

సంపత్ నంది

తొలి అడుగు... రావిపూడి

పటాస్‌తో మొదలై ఎఫ్‌2, సరిలేరు నీకెవ్వరూ సినిమాలతో వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువకెరటం అనిల్‌ రావిపూడి. ఓ వైపు అగ్రహీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు గాలిసంపత్‌కు స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అనీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రానున్న కాలంలో ఇలాంటి చిత్రాలు మరిన్ని ఈ యువ దర్శకుడి నుంచి ఆశించొచ్చు. ప్రస్తుతం అనిల్‌ రావిపూడి ఎఫ్‌3 చిత్ర పనుల్లో బిజీగా గడుపుతున్నారు.

దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ మీకు మాత్రమే చెప్తా చిత్రానికి మాటలు అందించారు. అలాగే దర్శకుడు చందుమొండేటి నిఖిల్‌ నటించిన కిరాక్‌పార్టీకి మాటలు రాశారు. ఇలా దర్శకులు తమ సినిమాలకు కథలు రాసుకోవడం నిన్నటి వరకూ జరిగితే..ప్రస్తుతం వేరే వారి సినిమాలకు కథలు, మాటలు అందిస్తున్నారు.

అనిల్​ రావిపూడి

ఇదీ చూడండి : ఏ దర్శకుడూ నా అంత డబ్బు సంపాదించలేదు: పూరీ

ABOUT THE AUTHOR

...view details