తెలంగాణ

telangana

By

Published : May 5, 2021, 6:45 AM IST

ETV Bharat / sitara

సవాల్​ పాత్రలకు సొగసరి సిద్ధం!

సవాల్‌ విసిరే పాత్రలతో సత్తా చాటేందుకు నవతరం కథానాయికలు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. అందచందాలు ఒలికిస్తూ అలరించడమే కాదు.. అవకాశమొచ్చినప్పుడల్లా ఆ సొగసుల మాటు నుంచి విలనిజాన్ని పండిస్తున్నారు. బెదురు లేని సివంగుల్లా హీరోల్ని ఢీ కొడుతూ.. వెండితెరపై తమ విలనిజంతో మెరుపులు మెరిపిస్తున్నారు. ఇప్పుడిలా ప్రతినాయిక పాత్రలతో అలరించేందుకు పలువురు స్టార్‌ నాయికలతో పాటు కొందరు కొత్తభామలు సిద్ధమవుతున్నారు.

Telugu heroines cultivating villainism on the silver screen
సవాల్​ పాత్రలకు సొగసరి సిద్ధం!

అందాల కథానాయికలు.. శక్తిమంతమైన ప్రతినాయికలుగా మెప్పించడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు అగ్రనాయికగా జోరు చూపిన రమ్యకృష్ణ.. 'నరసింహా' చిత్రంలో రజనీకాంత్‌కు సవాల్‌ విసిరే ప్రతినాయికగా నీలాంబరి పాత్రలో మెప్పించారు. సంప్రదాయబద్ధమైన పాత్రలతో అలరించిన రాశి 'నిజం'లో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో గోపీచంద్‌కు జోడీగా మురిపించించారు.

ఈతరంలోనూ వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రెజీనా, రీతూ వర్మ, పాయల్‌ రాజ్‌పుత్‌, కాజల్‌ లాంటి వారంతా లేడీ విలన్లుగా మారి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్న వారే. ముఖ్యంగా ఇటీవల కాలంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రెజీనా ప్రతినాయిక పాత్రలకు చిరునామాగా మారారు. ఇప్పుడీ పంథాలోనే మరికొందరు ముద్దుగుమ్మలు లేడీ విలన్లుగా భయపెట్టేందుకు సెట్స్‌పై ముస్తాబవుతున్నారు.

భయపెట్టనున్న కీర్తి

కెరీర్‌ తొలినాళ్ల నుంచీ నటనా ప్రాధాన్యమున్న పాత్రలతోనే మెప్పిస్తూ వస్తోంది నటి కీర్తి సురేశ్​. 'మహానటి'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ నాయిక.. ఇప్పుడు విలక్షణమైన పాత్రలతో ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తమిళంలో 'సాని కాయిధం' అనే చిత్రానికి పచ్చజెండా ఊపింది. దీంట్లో దర్శకుడు సెల్వరాఘవన్‌ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అరుణ్‌ మాతేశ్వరన్‌ దర్శకుడు.

కీర్తి సురేశ్​

ఓ విభిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో.. కీర్తి ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌లో ఆమె కనిపించిన విధానం ఆసక్తిరేకెత్తించింది. ఆ పోస్టర్‌లో ఆమె రక్తంతో తడిసిన అవతారంలో.. ఎదురుగా పదునైన మారణాయుధాలు పెట్టుకోని దర్శనమిచ్చింది.

తమన్నా తొలిసారి..

స్టార్‌ కథానాయిక స్థాయిని ఎప్పుడో అధిగమించింది తమన్నా. అందుకే ఇప్పుడు పాత్రల ఎంపికలో వైవిధ్యత కనబరుస్తోంది. ఈ క్రమంలోనే లేడీ విలన్‌గా భయపెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆమె నితిన్‌తో కలిసి 'మ్యాస్ట్రో' చిత్రం చేస్తోంది. బాలీవుడ్‌లో విజయవంతమైన 'అంధాధున్‌'కి రీమేక్‌గా రూపొందుతోంది. మేర్లపాక గాంధీ దర్శకుడు.

తమన్నా

ఈ చిత్రంలో మాతృకలో టబు చేసిన పాత్రనే ఇప్పుడు తమన్నా తెలుగులో పోషిస్తోంది. ఇది పూర్తి ప్రతినాయిక ఛాయలున్న పాత్ర. బోల్డ్‌గానూ ఉంటుంది. ఈ పాత్రలో తమన్నా విలనిజం ఏస్థాయిలో ఉండబోతుందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.

కొత్త దారిలో సమంత

సమంత

దశాబ్ద కాలంగా సాగుతున్న సినీప్రయాణంలో ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించింది నటి సమంత. ఇప్పుడు డిజిటల్‌ తెరలపైనా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె రాజ్‌ - డీకే దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఫ్యామిలీమెన్‌ 2'లో ఓ ప్రధానపాత్రలో నటిస్తోంది. ఇది సామ్‌ చేస్తున్న తొలి వెబ్‌సిరీస్‌. ఇందులో ఆమెది ప్రతినాయిక ఛాయలున్న పాత్రే. ఈ సిరీస్‌లో ఆమె పాకిస్థాన్‌ టెర్రరిస్ట్‌గా కనిపించనుంది. ఈ వెబ్‌సిరీస్‌ త్వరలోనే ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. సమంత విలన్‌గా మారడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆమె విక్రమ్‌తో చేసిన '10' చిత్రంలోనూ విలన్‌గా కనిపించి అలరించింది.

పాయల్‌.. మూడోసారి

పాయల్​ రాజ్​పుత్​

'ఆర్‌ఎక్స్‌ 100' చిత్రంతో అలరించిన అందం పాయల్‌ రాజ్‌పుత్‌. నటిగా తొలి అడుగులోనే ప్రతినాయిక ఛాయలున్న పాత్ర పోషించి మెప్పించింది. ఇటీవల ఆహాలో విడుదలైన 'అనగనగా ఓ అతిథి' వెబ్‌ సిరీస్‌లోనూ వ్యతిరేక ఛాయలున్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇప్పుడు మూడోసారి ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో దర్శనమివ్వనున్నట్లు సమాచారం. ఆమె 'త్రీ రోజస్‌' అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. దీంట్లో పాయల్‌ నెగటివ్‌ షెడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది.

అనసూయ కూడా?

అనసూయ

అల్లు అర్జున్‌ 'పుష్ప' చిత్రంలో అనసూయ ఓ కీలకపాత్రలో నటిస్తోంది. ఇందులో ఆమెది వ్యతిరేక ఛాయలున్న పాత్రే అని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె గతంలో అడివి శేష్‌ 'క్షణం' చిత్రంలో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించింది.

ఇదీ చూడండి:నన్ను ఆడపిల్ల అనుకొని పొరబడేవారు: ది రాక్​

ABOUT THE AUTHOR

...view details