కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని తమిళ సినీ హీరో విజయ్ తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామికి విజయ్ ఓ అభ్యర్థన చేశారు. ప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటించిన 'మాస్టర్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ యూట్యూబ్లో రికార్డులు సృష్టించింది. సంక్రాంతికి కానుకగా ఈ సినిమాను అభిమానుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 2021 జనవరి 7 నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభించనున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో.. థియేటర్లపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను సడలించి, 100శాతం ప్రేక్షకులను అనుమతించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని విజయ్ కోరారు. అయితే.. విజయ్ అభ్యర్థనపై ముఖ్యమంత్రి ఎలా స్పందించారనేది ఇంకా తెలియరాలేదు.