తెలంగాణ

telangana

అవని తల్లి ఒడికి గాన గాంధర్వుడు ఎస్పీ బాలు

By

Published : Sep 26, 2020, 7:37 PM IST

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అవని తల్లి ఒడికి చేరుకున్నారు. అభిమానులకు తన పాటలను జ్ఞాపకాలుగా మిగిల్చి దివికేగారు.

SP Balasubrahmanyam's funeral: Veteran singer laid to rest at his farmhouse
అవని తల్లి ఒడికి గాన గాంధర్వుడు ఎస్పీ బాలు

అనితరసాధ్యమైన అమృత గానంతో పాటకు ప్రాణం పోసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులకు వేలాది పాటలు, అద్భుతమైన తన గానాన్ని జ్ఞాపకాలుగా అందించిన.. ఆ గాన గంధర్వుడి అంతిమ సంస్కారాలను చెన్నైలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో పూర్తిచేశారు. కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించగా తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

గతరాత్రి మహాలింగపురంలోని తన నివాసం నుంచి బాలు పార్థివ దేహాన్ని, చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలోని తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. శనివారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు వచ్చి తమ ఆరాధ్య గాయకుడిని కడసారి చూసుకున్నారు.

దర్శకుడు భారతీరాజా, గాయకుడు మనో, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ సహా తమిళ హీరో విజయ్, బాలు భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ చెన్నై వెళ్లి బాలుకు నివాళి అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.

అనంతరం బాలు భార్య సావిత్రమ్మ, ఆయన తనయుడు ఎస్పీ చరణ్, కుమార్తె పల్లవి, సోదరి శైలజ సహా కుటుంబీకులు చివరిసారిగా చేయాల్సిన క్రతువులను నిర్వహించారు.

ఆ తర్వాత అమరగాయకుడి అంతిమయాత్రలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. అనంతరం తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో సరస్వతీ పుత్రుడి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

సుమధుర గానంతో అశేష ప్రజానీకాన్ని ఓలలాడించిన గానగాంధర్వుడు, అవని తల్లి ఒడికి చేరుతున్న సమయంలో అశేష అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు.

ABOUT THE AUTHOR

...view details